మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఒక్కరోజులోనే 85 ఒమిక్రాన్ కేసులు, 3900 కరోనా కేసులు
ముంబై: దేశంలో కరోనావైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు క్రమంగా భారీగా పెగుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఒక్క ముంబై నుంచి 53 కేసులుండటం గమనార్హం. బుధవారం మహారాష్ట్రలో 3900 కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది.
పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) ల్యాబ్ లో జీనోమ్ సీక్వెన్సింగ్ లో 47 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా, వారిలో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులుండగా, నలుగురు కాంటాక్టులకు ఒమిక్రాన్ సోకిందని వైద్యులు తెలిపారు. ఇక, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)లో జరిగిన పరీక్షల్లో మరో 38 మందికి కొత్త వేరియంట్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఐఐఎస్ఈఆర్ లో నివేదికల్లో పాజిటివ్ గా తేలిని 38 మందికీ అంతర్జాతీయంగా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

ఇది ఇలావుండగా, రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒక్క అజ్మీర్ నుంచే 10 కేసులు రాగా, రాజధాని జైపూర్ నుంచి 9 కేసులు వచ్చాయని వైద్యులు తెలిపారు. ఇద్దరు బిల్వాడా నుంచి, అల్వార్, జోధ్ పూర్ నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 69కి చేరింది.
గుజరాత్ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 19 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు సంబంధిత వైద్యాదికారులు తెలిపారు. ఎవరిలోనూ తీవ్ర లక్షణాలు లేవన్నారు. ఏపీలోనూ 10 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 945కు చేరింది. ఇది ఇలావుండగా, మరోవైపు కరోనావైరస్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది. పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications