ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ మహారాష్ట్రలో: దక్షిణాఫ్రికా వెళ్లొచ్చిన వ్యక్తికి పాజిటివ్
ముంబై: దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికన్ దేశాల్లో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదివరకు వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారికి సంబంధించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ వేరియంట్ను వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ అనుమానాలు
యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలను తీసుకుంది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పుడు మహారాష్ట్రలో అడుగు పెట్టినట్టు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్ర థానెకు వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. అనారోగ్యానికి గురయ్యాడు. కల్యాణ్-డొంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అతని నమూనాలను సేకరించారు.
దక్షిణాఫ్రికా నుంచి..
కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. డొంబీవిలికి చెందిన ఆ వ్యక్తి సుమారు మూడు నెలల పాటు దక్షిణాఫ్రికాలో నివసించి, స్వస్థలానికి తిరిగి వచ్చాడు. అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే కల్యాణ్-డొంబివిలి మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఐసొలేషన్లో..
అతని నుంచి మరిన్ని శాంపిళ్లను సేకరించి, టెస్టింగ్ కోసం పంపించారు. అతన్ని డొంబివిలి ఆర్ట్ గ్యాలరీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్కు తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కల్యాణ్-డొంబివిలీ మున్సిపాలిటీ వైద్యాధికారిణి డాక్టర్ ప్రతిభా పన్పాటిల్ తెలిపారు. అతని కుటుంబ సభ్యులందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని, వాటికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉందని చెప్పారు. అతనితో పాటు దక్షిణాఫ్రికాకు వెళ్లొచ్చిన అన్నకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు డాక్టర్ ప్రతిభ తెలిపారు.
దక్షిణాఫ్రికా సహా
ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికా సహా ఆరు ఆఫ్రికన్ దేశాల్లో వ్యాప్తి చెందింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు వాయు సంబంధాలను తెంచుకున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఈ దిశగా భారత్ కూడా తక్షణ చర్యలు తీసుకుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి పునరుద్ధరించదలిచిన అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వాటిపై నిషేధం యధాతథంగా కొనసాగుతుందని తెలిపింది. దీనితో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చు. 20 నెలలుగా ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.
Recommended Video
12 దేశాల పౌరులకు
కంట్రీస్ అట్ రిస్క్ ప్రాతిపదికన 12 దేశాలకు చెందిన పౌరులకు అదనపు వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ సహా ఇతర యూరోప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంగ్కాంగ్, ఇజ్రాయెల్ల నుంచి వచ్చే వారు ఈ అదనపు ప్రొటోకాల్స్ను పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.