Uddhav Thackeray : ఉద్ధవ్ థాక్రేకు కరోనా-కేబినెట్ భేటీపై ఉత్కంఠ-గోవా గవర్నర్ కు ఇంఛార్జ్
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనలో చెలరేగిన అలజడి కొనసాగుతోంది. దీంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం ఉద్ధవ్ థాకరే మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అయితే ఆ లోపే ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను ఇతర నేతలు కలిసే అవకాశం లేకుండాపోయింది. ఇప్పటికే గవర్నర్ కోషియారీ కూడా కరోనాతో ఆస్పత్రిలో చేరడంతో కేంద్రం గోవా గవర్నర్ ను అక్కడికి పంపుతోంది.
ఉద్ధవ్ థాక్రేకు కరోనా
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనలో కలకలం చెలరెగుతున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తయారవుతున్న సీఎం ఉద్ధవ్ థాక్రే కొద్దిసేపటి క్రితం కరోనాగా తేలారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనాగా తేలడంతో థాక్రేను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ దూత కమల్ నాథ్ వెనుదిరిగారు.ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఇవాళ్టి కేబినెట్ భేటీపై సందిగ్ధత నెలకొంది.
కేబినెట్ భేటీపై సందిగ్ధత
మహారాష్ట్రలో శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్ థాక్రే చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫలించకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరాదని ఆయన భావిస్తున్నారు.
ఇందుకోసం మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి తరుణంలో ఉద్ధవ్ కోవిడ్ బారిన పడటంతో కేబినెట్ భేటీపై ఉత్కంఠ పెరుగుతోంది. కేబినెట్ భేటీకి ఉద్ధవ్ హాజరు కాకపోతే ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే వర్చువల్ భేటీ ద్వారా ఉద్ధవ్ హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు.
గోవా గవర్నర్ కు ఇంఛార్జ్ బాధ్యత
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చేరారు. దీంతో అటు ఏక్ నాథ్ షిండే కానీ,ఇటు ఉద్ధవ్ థాక్రే కానీ ఆయన్ను కలిసే అవకాశం లేకుండాపోయింది. గవర్నర్ అందుబాటులో ఉంటే బలనిరూపణ చేసుకోవాలని షిండే, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరాలని థాక్రే ఎదురుచూస్తున్నారు.
దీంతో మహారాష్ట్ర పరిణామాల్ని సొమ్ముచేసుకునేందుకు ఎదురుచూస్తున్న కేంద్రం.. వెంటనే గోవా గవర్నర్ ను మహారాష్ట్రకు ఇంఛార్జ్ గా పంపుతోంది. కోషియారీ స్దానంలో గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ముంబైకి వెళ్లి రాజకీయాన్ని చక్కబెట్టబోతున్నట్లు తెలుస్తోంది.