మహాసంక్షోభం - షిండే క్యాంపులోక 14 మంది ఎంపీలు ? త్వరలో ముంబైకి రిటర్న్
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనతో పాటు మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో తలెత్తిన తిరుగుబాటు రోజుకో ములుపు తిరుగుతోంది. ఇప్పటికే శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే క్యా్ంపుకు చేరిపోగా.. ఇప్పుడు ఎంపీలు కూడా అదే బాట పట్టారు. శివసేనకు పార్లమెంటులో 19 మంది ఎంపీలున్నారు.
శివసేనకు పార్లమెంటులో ఉన్న 19 మంది ఎంపీల్లో 14 మంది ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు షిండే క్యాంపు తమకు మెజార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు ప్రకటించుకుంది. దీంతో శివసేనలో భారీ చీలిక ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే గౌహతిలో రెబెల్ క్యాంప్ నిర్వహిస్తున్న షిండే ఇప్పుడు ఎంపీల్ని కూడా అక్కడికి రప్పించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు తమ అనర్హత నోటీసులపై వచ్చేనెలలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అప్పటిపరకూ వారు గౌహతి వీడి ముంబయికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కానీ త్వరలో తాను ముంబైకి తిరిగి వస్తానని ఏక్ నాధ్ షిండే చెప్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో సీఎంఉద్ధవ్ థాక్రే అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇది ముగిశాక సాయంత్రం మరోసారి పార్టీ నేతలతో సమావేశమై కీలక నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరువర్గాల అడుగులు ఆసక్తి రేపుతున్నాయి.