‘మహాత్ముడి’ స్కూల్ మూసివేత.. 164 ఏళ్ల చరిత్ర.. ఇక మ్యూజియంగా..
జాతిపిత మహాత్మాగాంధీ విద్యాభ్యాసం చేసిన ఆల్ప్రెడ్ హైస్కూల్ మూతపడింది. దాదాపు 164 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల ఇకమీదట ప్రదర్శన శాలగా మారనుంది.
రాజ్కోట్: జాతిపిత మహాత్మాగాంధీ విద్యాభ్యాసం చేసిన ఆల్ప్రెడ్ హైస్కూల్ మూతపడింది. దాదాపు 164 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాలను ఖాళీ చేశారు. ఇక ముందు నుంచి ఈ పాఠశాల ప్రదర్శన శాల(మ్యూజియం)గా మారనుంది.
బ్రిటీషు పరిపాలన కాలంలో 1853 అక్టోబర్ 13న ఈ పాఠశాలను స్థాపించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇదే మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల. ప్రస్తుతం ఉన్న భవన సముదాయాన్ని జునాఘడ్ నవాబ్ 1875లో నిర్మించాడు. ఆయనే ఆ పాఠశాలకు ఆల్ప్రెడ్ హైస్కూల్ అని పేరు పెట్టారు.
అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని.. మోహన్దాస్ గాంధీ హైస్కూల్ గా పేరు మార్చి పిలవడం మొదలుపెట్టారు. గుజరాత్ ప్రభుత్వం నడుపుతున్న ఈ పాఠశాలను మ్యూజియంగా మార్చాలని గత ఏడాదే ప్రతిపాదన వచ్చింది. 1887లో గాంధీజీ ఈ పాఠశాల నుంచి ఉత్తీర్ణుడిగా బయటకొచ్చారు. అప్పుడాయన వయసు 18 సంవత్సరాలు.
మ్యూజియంగా మార్చే ఆలోచన రాగానే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న 125 మంది విద్యార్థులకు బదిలీ ధ్రువపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ మధ్యనే ప్రారంభించారు. 'ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులకు బదిలీ ధ్రువపత్రాలు ఇస్తున్నాం.. వచ్చే ఏడాది నుంచి వీరు తమకు నచ్చిన పాఠశాలలో చదువుకోవచ్చు.. ' అని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.
రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పాఠశాలను మూసివేసి మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనను పాఠశాల శాఖ అధికారులకు అందజేయడంతో దానికి ఆమోదం లభించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.