శీతాకాలం సమావేశాల్లోగా మోడీ మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గాన్ని తొలిసారి విస్తరించే అవకాశం ఉంది. వచ్చే నెల చివరివారంలో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సోమవారం సమావేశమై పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభలు కూడా నవంబర్ చివరి వారంలో సమావేశం కానున్నట్లు చెబుతున్నారు.
పరిపాలనాపరంగానే కాకుండా రాజకీయ కారణాల వల్ల కూడా మంత్రి విస్తరణ అవసరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా శాఖలకు పూర్తి స్థాయిలో మంత్రులు లేరు. వాటిని ఇతర శాఖల మంత్రులు అదనపు బాధ్యతలుగా నిర్వహిస్తున్నారు. ఈ తాత్కాలిక ఏర్పాటు గత ఐదు నెలలుగా కొనసాగుతోంది.

ముఖ్యమైన శాఖలకు పూర్తి స్థాయి మంత్రుల అవసరం ఉందని, ప్రభుత్వం వేగంగా ముందుకు కదిలి తన విధాన నిర్ణయాలను అమలు చేయాలంటే అది అవసరమని భావిస్తున్నారు. అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖతో పాటు రక్షణ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే నితిన్ గడ్కరీ గ్రామీణాభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తున్నారు. రవిశంకర్ ప్రసాద్ కమ్యూనికేషన్ల శాఖతో పాటు న్యాయశాఖను కూడా నిర్వహిస్తున్నారు. పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ చేపట్టి శాఖలను తగిన విధంగా కేటాయించడంతో పాటు అధికార యంత్రాంగంలో కూడా తగిన మార్పులు చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. రాజీ మెహరుషిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, అర్వింద్ సుబ్రహ్మణ్యాన్ని ప్రధాన ఆర్ధిక సలహాదారుగా నియమించడంతో ఇది ప్రారంభమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications