అభిమానుల అత్యుత్సాహం... కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్.. ప్రచారానికి బ్రేక్...
అభిమానుల అత్యుత్సాహంతో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ గాయపడ్డారు. అంతా ఒక్కసారిగా మీదపడి ఆయన కుడి కాలిని తొక్కేశారు. దీంతో తీవ్రమైన నొప్పితో కమల్ హాసన్ హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కోయంబత్తూర్లో శనివారం(మార్చి 20) ఉదయం కమల్ హాసన్ మార్నింగ్ వాక్కి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆస్పత్రిలో ఆయన కాలికి స్కానింగ్ చేసిన వైద్యులు కంగారుపడాల్సిందేమీ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో కుడి కాలి ఎముకలో ఇన్ఫెక్షన్తో కమల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. తాజాగా అదే కాలికి గాయం కావడంతో ఆయన నొప్పితో విలవిల్లాడారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలు వెల్లడించారు. దీంతో కమల్ హాసన్ క్యాంపెయిన్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీరోజూ స్థానికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం వందలాది మంది అభిమానులు ఆయన్ను చుట్టుముడుతున్నారు. తాజాగా మార్నింగ్ వాక్కి వెళ్లిన సమయంలోనూ ఇదే జరిగింది. అభిమానులంతా ఒక్కసారిగా చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడటంతో ఆయన కాలికి గాయమైంది.
కాగా,. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుంది. మిగతా 80 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి. ఇందులో ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి(IJK),ఇంధియా జననాయగ కచ్చి(AISMK) పార్టీలు చెరో 40 స్థానాలను పంచుకోనున్నాయి. యూపీఏ,ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఐజేకె,ఏఐఎస్ఎంకెలతో కలిసి కమల్ హాసన్ ఈ థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ... ఒక్క స్థానంలో కూడా మక్కల్ నీది మయ్యం గెలవలేకపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ రెండు,మూడు స్థానాలకు మించి గెలవలేదని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. మరోవైపు కమల్ హాసన్ మాత్రం ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపిస్తుందన్న ధీమాతో ఉన్నారు.