ప్రముఖ సీరియల్ నటుడి ఆత్మహత్య...? సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని... షాక్లో టీవీ ఇండస్ట్రీ
ప్రముఖ మలయాళ టీవీ నటుడు రమేష్ వలియాసల(54) తిరువనంతపురంలోని ఆయన నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. రమేష్ మృతిని మొదట ఆయన భార్య గుర్తించారు.శనివారం(సెప్టెంబర్ 11) ఉదయం 6.30గంటల సమయంలో ఆమె రమేష్ పడుకున్న గదిలోకి వెళ్లి చూడగా... సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు.
రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రమేష్ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా ఆయన తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు గుర్తించారు. కరోనా లాక్ డౌన్ ఆయన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించిందని చెబుతున్నారు.
రమేష్ వలియాసలకు భార్య,కుమారుడు ఉన్నారు. గత 22 ఏళ్లుగా ఆయన టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే సీరియళ్లలో నటిస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం రమేష్ పౌర్ణమిథింగల్ సీరియల్ షూట్లో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.రమేష్ మృతిపై మలయాళ టీవీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు,దర్శక నిర్మాతలు,అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా మృతి :
ఇటీవలే హిందీ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా (40) గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మోడల్గా పరిచమైన సిద్దార్థ్ బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఝలక్ దిఖ్లా జా 6', బిగ్బాస్ 13షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు. బాలీవుడ్ బిగ్బాస్ 13వ సీజన్లో విజేతగా నిలిచారు. కరణ్ జోహర్ నిర్మించిన 'హంప్టీ శర్మా కీ దుల్హానియా' చిత్రంలో సహాయ నటుడి పాత్రలో నటించారు.
సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 3.30గంటల సమయంలో సిద్దార్థ శుక్లా అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో తల్లికి చెప్పాడు. ఆమె కొన్ని మంచి నీళ్లు ఇచ్చి తాగమని చెప్పింది. ఆ తర్వాత బెడ్పై అతన్ని పడుకోబెట్టింది. ఉదయం చాలాసేపటివరకూ సిద్దార్థ శుక్లా నిద్ర నుంచి మేల్కొనలేదు. తల్లి అతని గదిలోకి వెళ్లి నిద్ర లేపే ప్రయత్నం చేయగా... అతని నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోయింది. దీంతో వెంటనే తన కూతురికి ఫోన్ చేయగా... ఆమె డాక్టర్కు ఫోన్ చేసింది.గురువారం ఉదయం 9.40 గంటల సమయంలో సిద్దార్థ శుక్లాను అంబులెన్సులో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శుక్లా సోదరి,బావ,కజిన్ ముగ్గురు అతని వెంట ఉన్నారు. 10.15గంటల సమయంలో వైద్యులు శుక్లా మృతదేహాన్ని పరిశీలించి అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు.
ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు 40 ఏళ్లకే లోకాన్ని వీడటం చాలామందిని కలచివేసింది. సిద్దార్థ శుక్లా గుండెపోటుతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినప్పటికీ... ఇంకా ఎక్కడో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.