మగబిడ్డను పుట్టిస్తామని.. థాయ్లాండ్, దుబాయ్కు పంపిస్తూ..
ఏ దంపతులైనా మగ బిడ్డ కావాలనుకోవడం అత్యంత సహజం. అలాంటి బలహీనతను పలు రకాల వ్యక్తులు, సంస్థలు క్యాష్ చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మగ బిడ్డ కోసం పరితపించే దంపతులను బురిడీ కొట్టించడానికి చేస్తున్న ఓ కాల్ సెంటర్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఆ సంస్థను నడుపుతున్న నిర్వాహకులను కటకటాల వెనుకకు నెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. అసలు కాల్ సెంటర్ బాగోతం ఏమిటంటే..
సంతాన లేమితో బాధపడే
సంతాన లేమితో బాధపడుతున్న దంపతులను ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతానికి చెందిన ఆరోగ్యశాఖ కాల్ సెంటర్ ముగ్గులోకి దిపింది. పిల్లలు లేకపోవడం, అది కాకుండా తమకు పుట్టే మగ బిడ్డ అయితే బాగుంటుందని కోరుకోవడంతో వారి బలహీనతను ఆసరగా చేసుకొని డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. కాల్ సెంటర్పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్నారు.
విచారణలో భయంకర వాస్తవాలు
కాల్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు విచారించగా భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా మగ బిడ్డను పుట్టిస్తామని చెప్పి దంపతుల నుంచి దండిగా సొమ్ము వసూలు చేస్తున్నారు. వారిని థాయ్లాండ్, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు పంపిస్తూ టోకరా వేస్తున్నారు. మగబిడ్డపై ఆశలు పెట్టుకొన్న దంపతులు భారీగా సొమ్మును సమర్పించుకొన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు
ఐవీఎఫ్ చికిత్స కోసం ఒక్కొక్క దంపతుల నుంచి కనీసం రూ.9 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. మరికొందరి వద్ద నుంచి ఇంకా డబ్బు భారీగానే గుంజినట్టు తెలిసింది. కాల్ సెంటర్ నిర్వాహకులపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దాడులు చేశారు. దేశవ్యాప్తంగా 100కుపైగా ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
6లక్షలకుపైగా.. 300 మంది ఉద్యోగులతో
ఇప్పటి వరకు ఇలా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం దంపతులు లక్షలా మందికి పైగానే ఈ సంస్థను ఆశ్రయించినట్టు సమాచారం. ఈ సర్వీసులో భాగంగా 6 లక్షలకుపైగా విదేశాలకు పంపినట్టు నిర్వాహకులు విచారణలో తెలిపారు. ఇంకా ఇందులో విశేషమేమిటంటే.. ఈ కాల్ సెంటర్ను నడిపేది ఐఐటీ ఇంజినీర్ కావడం. దేశవ్యాప్తంగా సంతానలేమితో బాధపడే దంపతులను సంప్రదించడానికి 300 ఉద్యోగులు పనిచేస్తున్నట్టు సమాచారం.