Parliament: బలహీన మహిళలకే టికెట్లు-రిజర్వేషన్ల బిల్లు వేళ ఖర్గే కామెంట్స్-నిర్మల ఫైర్..
పార్లమెంటులో ఎట్టకేలకు కేంద్రం ఇవాళ మహిళా బిల్లు ప్రవేశపెట్టింది. లోక్ సభలో పెట్టిన ఈ బిల్లుపై చర్చ కూడా ప్రారంభమైంది. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అదే సమయంలో రాజ్యసభలోనూ మహిళా బిల్లుపై సాధారణ చర్చ జరుగుతోంది. ఇందులో మాట్లాడిన విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మహిళకు రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్న విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో బలహీనమైన మహిళలకు టికెట్లు ఇస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు. దీంతో అధికార బీజేపీ ఆయన వ్యాఖ్యలపై మండిపడింది. ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా ఖర్గే మాత్రం వెనక్కి తగ్గలేదు. గట్టిగా మాట్లాడే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వారికి ఇష్టం లేదని బీజేపీని ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యానించారు.

బలహీన వర్గాల మహిళల్ని బీజేపీ తమ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు. తాము 2010లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభలో ఆమోదించినట్లు గుర్తుచేశారు. కానీ మహిళా బిల్లుపై క్రెడిట్ ను ప్రధాని మోడీ తమకు ఇవ్వదల్చుకోలేదన్నారు. ప్రస్తుతం తెస్తున్న మహిళా బిల్లులోనూ ఎస్సీ,ఓబీసీ రిజర్వేషన్లు చేర్చాలని ఖర్గే కోరారు. మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుక బడిన కులాలకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఖర్గే వ్యాఖ్యలపై ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

ఖర్గే గాలి వాటం వ్యాఖ్యలు చేశారని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని ఆయనకు గుర్తుచేశారు. అలాగే రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు ఖర్గే చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ఏ రాష్ట్రానికీ జీఎస్టీ బకాయిలు లేవన్నారు. ఉంటే ఆధారాలు చూపాలని ఖర్గేను కోరారు. మరోవైపు ఎల్లుండి రాజ్యసభలో మహిళా బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications