జాతీయ నేతలకు మమతా లేఖ - 15న కీలక భేటీ : సీఎం జగన్ - చంద్రబాబు తో మాత్రం..!!
రాష్ట్రపతి ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కోసం ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి అన్ని పక్షాల నేతలకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం మంతనాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ వ్యాప్తంగా 22 మంది నేతలకు లేఖలు రాసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసారు. ఈ నెల 15న ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఎన్డీఏ అభ్యర్ధిని ఓడించటమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీకి హాజరుకావాలని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
ఉమ్మడి అభ్యర్దిని ప్రతిపాదిస్తారా
ఎన్డీఏ పక్షాన్ని నిలువరించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పలు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ భేటీకి హాజరుకావాలని మమత పిలుపు నిచ్చారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతో విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో దీదీ సమావేశమవుతారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసారు. మమతా లేఖలు రాసిన వారిలో ముఖ్యమంత్రులు.. అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సొరెన్, భగవంత్ మాన్లు ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆహ్వాన లేఖను పంపించారు.
జగన్ - చంద్రబాబుకు అందని ఆహ్వానం
అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మమతా లేఖ రాయలేదని తెలుస్తోంది. కొద్ది రోజల క్రితమే సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్ధికి మద్దతివ్వాలని బీజేపీ ముఖ్య నేతలు కోరినట్లుగా ప్రచారం సాగింది. ఏపీ సీఎం ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతిస్తారని మమతా భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఆహ్వానం లేదు. పార్టీ పరంగా అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో తక్కువ బలం ఉండటంతో.. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో టీడీపీ సంఖ్యా బలం చాలా తక్కువ.
ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నికలు
కానీ, సీనియర్ నేతగా చంద్రబాబు 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేసారు. కానీ, ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. చంద్రబాబు కు సైతం మమత నుంచి ఆహ్వానం రాకవపోటంతో..అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి. అయితే, ఎన్డీఏ ఎవరిని అభ్యర్ధిగా ప్రతిపాదన చేస్తుందనే అంశం ఆధారంగా ఇటు ప్రతిపక్షాలు..ఈ సమావేశంలో తమ భవిష్యత్ నిర్ణయాలకు ఒక రూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఎన్నిక జరగనుంది.