జగన్ పథకాన్ని కాపీ కొట్టిన మమత బెనర్జీ: రూ.5,000 భృతితో: కోర్టులకు వెళ్లొద్దంటూ విజ్ఞప్తి
కోల్కత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. దిశ చట్టాన్ని అమలు చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దిశ చట్టంతో పాటు వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావడానికి కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే వ్యవస్థ అమలుపై ఒడిశా సర్కార్ కూడా ఆసక్తి చూపింది.

ఢిల్లీ, కర్ణాటకల్లో..
చౌక ధరల దుకాణాల ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే సరఫరా చేసే పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేస్తోంది. ఇప్పుడు ఇదే పథకాన్ని కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తోన్నాయి. ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కర్ణాటక సర్కార్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇదివరకే ప్రకటించారు.

ఇక పశ్చిమ బెంగాల్లో..
ఇదే జాబితాలో తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేరింది. ఇంటింటికీ రేషన్ను సరఫరా చేసే పథకాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రారంభించారు. దువారే రేషన్ పేరుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం వల్ల 10 కోట్ల మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని మమత బెనర్జీ చెప్పారు. దీనితోపాటు చౌకడిపోల డీలర్ల కమిషన్ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. క్వింటాల్ ఆహార ధాన్యాల సరఫరాకు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 75 రూపాయల కమిషన్ ఇస్తోంది. దీన్ని రెట్టింపు చేశారు. 150 రూపాయలకు పెంచారు.

10 కోట్ల మందికి లబ్ది..
నిర్దేశిత గడువులోగా పేదల ఇళ్ల వద్దకే రేషన్ను అందజేస్తామని, దీనివల్ల 10 కోట్ల మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు. చౌక డిపోలకు వచ్చే వారిలో ఎక్కువ వృద్ధులు, మహిళలు ఉంటున్నారని, వారు ఇక రేషన్ దుకాణాల వద్ద బారులు తీరి నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంటికే రేషన్ను సరఫరా చేస్తున్నామని, నిర్దేశిత గడువులోగా డీలర్లే స్వయంగా తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకు వచ్చి బియ్యాన్ని అందిస్తారని అన్నారు.

41 వేలమంది నియామకం..
ఇంటింటికీ రేషన్ పథకాన్ని అమలు చేయడానికి ప్రతి డీలర్ కూడా కనీసం ఇద్దరిని నియమించుకోవాలని, వారికి చెల్లించాల్సిన భృతి కోసం కమిషన్ను రెట్టింపు చేశామని అన్నారు. 75 రూపాయలుగా ఉన్న కమిషన్ను 150 రూపాయలకు పెంచామని చెప్పారు. ఆ ఇద్దరికి తామే ప్రతినెలా 5,000 రూపాయల భృతిని అందజేస్తామని మమత బెనర్జీ ప్రకటించారు. ఫలితంగా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించినట్టవుతుందని అన్నారు.

రూ.5,000 గౌరవ వేతనం..
పశ్చిమ బెంగాల్లో 21,000 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. ఇంటింటికీ రేషన్ పథకాన్ని అమలు చేయడానికి ఒక్కో రేషన్ షాప్లో ఇద్దరేసి చొప్పున సిబ్బందిని అదనంగా నియమించుకుంటే.. 42,000 మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మమత బెనర్జీ అన్నారు. వారికి ప్రతినెలా 5,000 రూపాయలను గౌరవ వేతనాన్ని అందిస్తామని చెప్పారు. రేషన్ను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను కొనుగోలు చేయడానికి డీలర్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు.

కోర్టులకు వెళ్లొద్దంటూ..
ఇంటింటికీ రేషన్ పథకాన్ని డీలర్లు ఎవరూ అడ్డుకోవద్దని మమత బెనర్జీ సూచించారు. ఈ పథకాన్ని నిలిపివేయాలంటూ ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించ వద్దని విజ్ఞప్తి. కోట్లాదిమంది ప్రజలకు లబ్దిని కలిగించే పథకంగా అభివర్ణించారు. పేదల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. డీలర్ల సమస్యలను కూడా తీర్చుతామని, ఇందులో భాగంగా వారి కమిషన్ను రెట్టింపు చేశామని అన్నారు.
Recommended Video

కోర్టులో పిటీషన్ కొట్టివేత..
ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేయాలంటూ కొందరు డీలర్లు హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేయగా.. దాన్ని తిరస్కరించింది. కొట్టివేసింది హైకోర్టు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మమత బెనర్జీ ప్రభుత్వం ప్రత్యేెకంగా ఓ మొబైల్ యాప్ను కూడా రూపొందించింది. ఖాద్య సాథీ: అమర రేషన్ మొబైల్ యాప్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మమత బెనర్జీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications