అక్కడ చంద్రబాబు ఉన్నారు మోడీ ఆటలు సాగవ్!: అద్వానీని కలిసిన మమత
Recommended Video
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో పలువురిని కలిశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడారు. తాను అద్వానీని కలిసి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశానని ఆమె చెప్పారు. తాను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, దేవేగౌడను, అరవింద్ కేజ్రీవాల్లను కూడా కలుస్తానని చెప్పారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉంటున్న ఆమె రాజకీయ నేతలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని విపక్షాలు సమష్టిగా ఎదుర్కోవాలని మమతా అన్నారు. ప్రతిపాదిత కూటమి తమ ప్రధాన మంత్రి అభ్యర్థి పేరును ముందుగా వెల్లడించకూడదన్నారు. విపక్షాల ఐక్యతను తెలిపేందుకు జనవరి 19న కోల్కతాలో చేపట్టే భారీ ర్యాలీలో పాల్గొనాలని విపక్ష నేతలను కలుస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడనికి విపక్షాల సమష్టి నాయకత్వం అవసరమని, అందుకే నేను విపక్ష నేతలను కలిసి వారిని ర్యాలీకి ఆహ్వానిస్తానని చెప్పారు.
బీజేపీ రాజకీయాలు మా వద్ద కుదరవు
బీజేపీ చేస్తోన్న రాజకీయాలను తాము ఏమాత్రం సహించేది లేదన్నారు. దేశం మార్పును కోరుకుంటోందన్నారు. అది 2019లో జరిగితీరుతుందన్నారు. బీజేపీ జార్ఖండ్, చత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్లో విభజన రాజకీయాలను చేయగలదని, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వారి ఆటలు సాగవన్నారు. బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో విపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వారి ఆటలు సాగవన్నారు. ఏపీలో చంద్రబాబు, కర్ణాటకలో చంద్రబాబు ఉన్నందు వల్ల వారి ఆటలు సాగవన్నారు. 'జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడగలదు. బెంగాల్లో మాత్రం వారు ఆ పని చేయలేరు. ఎందుకంటే అక్కడ మేమున్నాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఆ పని చేయలేరు. అక్కడ చంద్రబాబునాయుడు, కుమారస్వామి వంటి నేతలు ఉన్నారు' అని మమత వ్యాఖ్యానించారు.
బీజేపీలో వాళ్లు మంచివాళ్లు
బీజేపీపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ ఆ పార్టీలోని పలువురు నేతలపై ప్రశంసలు కురిపించారు. ఆలూ, ఆలూ చిప్స్ ఒకేలా ఉండవని, అలాగే బీజేపీలోని చాలామంది మంచి నేతలు ఉన్నారని చెప్పారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ మంచివాళ్లని మమత చెప్పారు.
అసోం మా పక్క రాష్ట్రం అందుకే
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అంశంపై మమత మాట్లాడుతూ... అసోం తమ రాష్ట్రానికి బోర్డర్లో ఉందని చెప్పారు. అక్కడ ఏం జరిగినా ఆ ప్రభావం తమ రాష్ట్రం పైన కూడా పడుతుందన్నారు. అంతేకాకుండా అది తమ పక్క రాష్ట్రమని, కాబట్టి తమ పక్క రాష్ట్రం అసంతృప్తితో ఉంటే నిలదీస్తామని మమతా బెనర్జీ అన్నారు.
మమతపై కేసు నమోదు
మమతా బెనర్జీ మాజీ ప్రధాని దేవేగౌడను, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను, సమాజ్ వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా తదితరులను కలిశారు. తాను యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నులను కలిసి అసోంకు మీ టీంను పంపించి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ విషయంలో నిజాలు తెలుసుకోవాలని కోరానని చెప్పారు. కాగా, రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ సర్కారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రజలను విభజించడం ద్వారా పౌరయుద్ధాన్నీ, రక్తపాతాన్నీ సృష్టించి ఓట్ల రూపంలో ప్రయోజనం పొందజూస్తోందని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లోనూ ఈ ప్రక్రియను చేపడతారా? అని ప్రశ్నించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలపై అసోంలో కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలపై అసోంలోని దిబ్రూగఢ్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మమతపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.