బెంగాల్లో కరోనా కల్లోలం- మిగిలిన మూడు దశలు ఒకేసారి పెట్టాలని మమత డిమాండ్
పశ్చిమబెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కేసులతో రాజకీయనేతలు ప్రచారం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో సీఎం మమతా బెనర్జీ ఎన్నికల పోలింగ్పై ఈసీకి ఓ కీలక విజ్ఞప్తి చేశారు.
With folded hands, I request Election Commission to hold three phases of polls on a single day or in two days. Please don't play with the lives of people: Bengal CM Mamata Banerjee in Chakulia, Uttar Dinajpur pic.twitter.com/FHnG9F4Hah
— ANI (@ANI) April 19, 2021
బెంగాల్లో 8 దశల పోలింగ్లో భాగంగా ఇప్పటివరకూ ఐదు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశల పోలింగ్ మిగిలుంది. దీంతో ఈ మూడు దశల పోలింగ్ను ఒకే రోజు లేదా రెండు రోజుల పాటు నిర్వహిచాలని ఎన్నికల సంఘాన్ని సీఎం మమతా బెనర్జీ కోరారు. బెంగాల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసీ ఈ మేరకు పోలింగ్ దశల్ని కుదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీఎంసీ తరఫున ఈసీకి లేఖ కూడా రాశారు.
చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మిగిలిన మూడు దశల పోలింగ్ను ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయండి అంటూ మమతా బెనర్జీ ఉత్తర దినాజ్పూర్లో నిర్వహించిన ర్యాలీలో ఈసీని బహిరంగంగానే కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా తమ ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ కూడా ప్రకటించారు. ఇవాళ ర్యాలీలు ముగించుకుని రేపటి నుంచి ప్రచారానికి మమత దూరం కానున్నారు.