బీజేపీని ఓడించేందుకు వామపక్షాలతో దోస్తీ: మమతా
న్యూఢిల్లీ: ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం మరో సంచలన ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించేందుకు వామపక్షాలతో జతకట్టేందుకూ వెనుకాడబోమని ఆమె ప్రకటించారు.
మంగళవారం హెడ్ లైన్స్ టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించిన ఆమె.. ఈ మాటతో దేశ వ్యాప్త చర్చకు దారితీశారు. ముఫ్పై సంవత్సరాల పాటు బెంగాల్ను పరిపాలించిన లెప్ట్ పార్టీలతో పోరాడి.. 2011 ఎలక్షన్స్లో చరిత్ర సృష్టించిన ఈ ముఖ్యమంత్రి తాజాగా అదే పార్టీతో కలిసి పనిచేస్తామనడంలో రాజకీయ విశ్లేషకులు నివ్వెర పోతున్నారు.
మతతత్వ రాజకీయ శక్తులను అణచివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆమె అదే భావనతో ఉన్న వామపక్షాలతో కలిసి పోరు సాగించనున్నామని ప్రకటించారు. ఈ విషయంలో తమ రెండు పార్టీల మధ్య సారూపత్య ఉందని మమత బెనర్జీ వెల్లడించారు.
వామపక్షాలతో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ, మతతత్వ శక్తులపై సాగించనున్న పోరులో మాత్రం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే మమత ఆఫర్ ను స్వీకరించబోమని సీపీఎం నేత మొహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం.

దీనికంతటికీ కారణం పశ్చిమ బెంగాల్లో జరిగిన శారదా చిట్ ఫండ్ స్కామ్ అని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2016లో పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగుతుండటంతో ఇప్పుడీ వ్యాఖ్యలు చర్చకు దారీతీశాయి. శారదా చిట్ ఫండ్ స్కామ్లో మమతా బెనర్జీ హస్తం ఉన్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే తృణమూల్ కాంగ్రెసు నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ పార్లమెంటు సభ్యుడు కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నాం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కోల్కతా ప్రెసిడెన్సీ జైలులో ఆయన ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శారదా చిట్ఫండ్స్ కుంభకోణంలో అరెస్టయిన ఆయన అప్పటి నుంచి ఆ జైలులోనే ఉంటున్నాడు. శారదా కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో తృణమూల్ నేత ఘోష్ను మాత్రమే నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న "అంతర్జాతీయ సదస్సు" ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు ఈ సదస్సుకి ఎన్డీయేతర పార్టీల ప్రతినిధులు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications