మోడీకి మరోసారి మామిడిపండ్లు పంపిన మమత-రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సోనియాకూ
తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ముడోసారి విజయం సాధించి సీఎం పీఠం దక్కించుకున్న మమతా బెనర్జీ రాజకీయాల్లో ప్రత్యర్ధుల విషయంలో ఎంత కరకుగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎన్నికలు ముగియగానే అప్పటివరకూ తమకు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ కార్యకర్తలు, నేతలపై టీఎంసీ నేతలు ఏ స్ధాయిలో విరుచుకుపడ్డారో అంతా చూశారు. కానీ అలాంటి మమతా బెనర్జీ ఏటా ఢిల్లీలో ఉండే జాతీయ స్దాయి రాజకీయ నేతలపై ఓ విషయంలో మాత్రం చాలా ఆప్యాయంగా వ్యవహరిస్తుంటారు.
ఏటా పశ్చిమబెంగాల్లో పండే విభిన్న రకాల మామిడి పండ్లను మమతా బెనర్జీ.. తన రాజకీయ ప్రత్యర్ధులైన ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, విపక్ష కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు పంపుతుంటారు. ఈసారి కూడా తాజాగా మామిడి పండ్లను తెప్పించి ఢిల్లీ పెద్దలందరికీ మమతా బెనర్జీ పంపారు. ఏడాది పొడవునా ఎన్ని రాజకీయాలు చేసినా వేసవిలో మామిడి పండ్లను మాత్రం ఢిల్లీలో సహచర రాజకీయ నేతలకు పంపడం ద్వారా మమతా బెనర్జీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.
మమతా బెనర్జీ ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, రాష్టపతి, ఉపరాష్టపతి సోనియాగాంధీ, కేజ్రివాల్ కు పంపే మామిడి పండ్లు వేటికవే ప్రత్యేకత కలిగినవే. ఇందులో బెంగాల్లో పండే హిమసాగర్, మాల్దా, లక్ష్మణ్ భోగ్ రకాలు తప్పనిసరిగా ఉంటాయి. గతంలో మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని మమతా బెనర్జీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్దం, సీఎస్ వివాదం తర్వాత మమతా బెనర్జీ ఈ మామిడి పండ్ల దౌత్యం కొనసాగించడంపై రాజకీయాలకు అతీతంగా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మమతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.