పశ్చిమబెంగాల్ సీఎంగా మమతాబెనర్జీ ప్రమాణం .. పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ , ప్రత్యేక అతిధిగా గంగూలీ
మూడవ సారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రాజ్ భవన్లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ మమతాబెనర్జీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించారు.కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది ముఖ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. గంగూలీ ఈ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
మూడోసారి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ
అనేక సవాళ్ల మధ్య మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి మరోమారు పశ్చిమ బెంగాల్ సీఎం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోబోతున్నారు . రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభణ, పోల్ అనంతర హింస కొనసాగుతున్న క్రమంలో మమతా బెనర్జీ మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.మమతా బెనర్జీ తన ట్రేడ్ మార్క్ వైట్ చీర మరియు శాలువలో బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు.
మే 9 న మిగతా కేబినెట్, మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మే 9 న మిగతా కేబినెట్, మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పశ్చిమబెంగాల్ లో 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగగా ఇందులో టిఎంసి 213 స్థానాల్లో బీజేపీ 77 స్థానాలు గెలుచుకుంది.మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ తన మొదటి ప్రాధాన్యత కరోనా మహమ్మారిని కట్టడి చేయడం అని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తాను నబన్నాలోని సెక్రటేరియట్లో కరోనా సంక్షోభం గురించి తాము తీసుకుంటున్న చర్యల గురించి ఒక సమావేశం నిర్వహిస్తానన్నారు.
కరోనా కట్టడి మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్న మమతా బెనర్జీ
మధ్యాహ్నం 3 గంటలకు తాను విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, మేము ఏ చర్యలు తీసుకుంటున్నామో తెలియజేస్తానని మమతా బెనర్జీ చెప్పారు. ఆదివారం ఎన్నికల ఫలితాల తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ మరియు బిజెపి ల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు పార్టీలు హింసకు కారణమయ్యాయి. బిజెపి ఓటమి తరువాత రాష్ట్రంలో ఇబ్బందులను రేకెత్తించడానికి ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మత ఘర్షణను సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, వారి సిగ్గుమాలిన ఓటమి కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు మమతాబెనర్జీ.
Recommended Video
నందిగ్రామ్ లో మమత ఓటమి, ఆరునెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం
తన మద్దతుదారులకు ఇంటి లోపల ఉండాలని మరియు అస్సలు ఎలాంటి సంబరాలు జరుపుకోవద్దని దీదీ అన్నారు.ఇక హింసపై ప్రధాని మోడీతో సహా పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారిపై ఓటమి పాలు కావడంతో సీఎంగా మమత అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారు బిజెపి నాయకులు.ఇక ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ చరిత్రలో మూడోసారి దీదీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని, బీజేపీపై పోరును మరింత ఉద్ధృతం చేశారని చెప్పొచ్చు.