Mamata Banerjee: మమతా బెనర్జీ అరుదైన రికార్డు ? సీజేఐ నిర్ణయంపై ఉత్కంఠ..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ (mamata banerjee) ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతగా, పోరాట యోధురాలిగా, ట్రేడ్ యూనియన్లను నడిపిన నాయకురాలిగా మాత్రమే అందరికీ తెలిసిన మమతా బెనర్జీ ఇవాళ ఓ అరుదైన ప్రయత్నం చేయబోతున్నారు. ఏకంగా సుప్రీంకోర్టులో ఓ కీలక కేసును స్వయంగా తానే వాదించేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి కూడా కోరారు.
పశ్చిమబెంగాల్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ వివాదాస్పదమవుతోంది. ఇందులో ఏకంగా 58 లక్షల ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే చిన్నా చితకా కారణాలతో ఇలా భారీ ఎత్తున ఓట్లు తొలగించడం ఏంటని మమత ఈసీని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకునే ఎన్నికల్లో ఓటర్లను పాల్గొనకుండా ఈసీ ఎలా అడ్డుకుంటుందని అడుగుతున్నారు. కానీ ఈసీ మాత్రం వెనక్కితగ్గడం లేదు. దీంతో మమత కీలక నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసును స్వయంగా తానే వాదించేందుకు అనుమతి ఇవ్వాలని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను కోరారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు స్వయంగా హాజరవుతున్న మమతా బెనర్జీ..అక్కడికక్కడే తనకు వాదించేందుకు మరోసారి అనుమతి కోరబోతున్నారు. దీనికి ఛీఫ్ జస్టిస్ అంగీకరిస్తే మమత నేరుగా వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు. న్యాయశాస్త్రంగా పట్టభద్రురాలైన మమత కొంతకాలంగా బెంగాల్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు అవకాశం లభిస్తే దేశంలో తొలిసారి ఈ అవకాశం దక్కిన సిట్టింగ్ సీఎంగా ఆమె రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు.












Click it and Unblock the Notifications