దీదీని టెన్షన్ పెడుతున్న "జై శ్రీరామ్".. ఐదు రోజుల్లో ఐదుగురు ఐపీఎస్ల బదిలీ..
కోల్కతా : బెంగాల్లో సార్వత్రక ఎన్నికల ఫలితాలు మమత బెనర్జీకి కంటి మీద కునుకులేకుండా చేశాయి. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుండటంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాషాయపార్టీకి అడుగులకు అడ్డుకట్ట వేసేందుకు వ్యూహరచనలో ఆమె నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

మమత అనుచరుడిని బదిలీచేసిన ఈసీ
బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బిదాన్నగర్ పోలీస్ కమీషనరేట్ అత్యంత కీలకమైంది. అక్కడ పలు ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సాల్ట్ లేక్ స్టేడియం, రాజారథ్ రెసిడెన్షియల్ కాలనీలు ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. గతంలో మమత అనుచరుడైన జ్ఞాన్వంత్ సింగ్ బిదాన్నగర్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఫిబ్రవరిలో కేంద్రానికి వ్యతిరేకంగా మమత బెనర్జీ నిర్వహించిన ధర్నాలో ఈయన కూడా పాల్గొన్నారు. సీఎంతో ఉన్న సన్నిహత సంబంధాలు దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్లో ఆయనను బదిలీ చేసింది. ఆయన స్థానంలో నటరాజన్ రమేష్ బాబుకు బాధ్యతలు అప్పగించింది.

ఐదు రోజులు.. ఐదుగురు ఐపీఎస్లు..
మే 26 ఈసీ కోడ్ ఎత్తివేయడంతో బిదాన్నగర్ కమిషనర్గా ఉన్న నటరాజన్ను బెంగాల్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. గతంలో కమిషనర్గా పనిచేసిన జ్ఞానవంత్ సింగ్కు మళ్లీ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకముందే ఆయనకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆయన స్థానంలో నిషాంత్ పర్వేజ్ను బిదాన్నగర్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మే 28న ఆయనను ట్రాన్స్ఫర్ చేసిన మమత సర్కారు.. భరత్ లాల్ మీనాను ఆ ప్లేస్లో రీప్లేస్ చేసింది. అయితే ఆయన ఛార్జ్ తీసుకునేలోపే మే 30న లక్ష్మీ నారాయణ్ మీనాను బిదాన్నగర్ కమిషనర్గా నియమిస్తూ దీదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

పలు కమిషనరేట్ల పరిధిలో
బిదాన్ నగర్లో మాత్రమే కాదు... ఇతర కమిషనరేట్ల పరిథిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. బీజేపీ అభ్యర్థికి సహకరించారన్న కారణంతో నార్త్ కోల్కతాలోని బారక్పూర్ కమిషనర్గా ఉన్న సునీల్ చౌదరీని తొలగించిన మమత బెనర్జీ ఆయన స్థానంలో దేబేంద్ర ప్రకాశ్ సింగ్ను నియమించింది. అయితే 24 గంటల్లోపే ఆయనను తొలగించి తన్మయ్ రాయ్ చౌదరీని ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఇదే తరహాలో అర్నబ్ ఘోష్, అన్నప్ప, జాయ్ బిశ్వాస్ తదితర ఐపీఎస్లకు సైతం రెండు రోజుల్లోనే స్థానచలనం తప్పలేదు.

ఐఏఎస్లకు తప్పని తిప్పలు
ఐపీఎస్లే కాదు... ఐఏఎస్ల విషయంలోనూ తృణమూల్ సర్కారు ఇదే పంథా కొనసాగించింది. మే 26న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన వెంటనే డార్జిలింగ్, కలింపాంగ్, ఈస్ట్ బుర్ద్వాన్, హుగ్లీ, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ 24 పరిగణాలు, హౌరా జిల్లాల కలెక్టర్లను దీదీ సర్కారు బదిలీ చేసింది. అయితే సీఎం మమత బెనర్జీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటిమాటికి బదిలీలు చేస్తుండటంపై ఐఏఎస్, ఐపీఎస్లు గుర్రుగా ఉన్నారు. భవిష్యత్తుపై నెలకొన్న సందేహాల నేపథ్యంలోనే దీదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications