బీజేపీ డబ్బులిస్తే తీసుకోండి..వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చెయ్యండి:నందిగ్రామ్ లో మమత సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు భారీ ర్యాలీని నిర్వహించారు, నందిగ్రామ్ లో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలను గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన ప్రజల జేబుల్లోకి డబ్బులు పెట్టి ఓట్లు అడిగే వారిని ఏప్రిల్ ఫూల్ చేయాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
ప్రజల ఆశీస్సులతో తాను రాజకీయాలు చేస్తానన్న మమత
తాను ఓట్ల కోసం ప్రజలను డబ్బులతో మభ్యపెట్టలేదని , ప్రజల ఆశీస్సులతో తాను రాజకీయాలు చేస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నందిగ్రామ్ లో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని పేర్కొన్న మమతా బెనర్జీ నందిగ్రామ్ ప్రజలు, రైతులు ఇంతకు ముందు గూండాలకు వ్యతిరేకంగా పోరాడారు. నందిగ్రామ్ రైతుల సమస్యలను పరిష్కరించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని , రైతుల హక్కు కోసం నేను ఎప్పుడూ పోరాడుతాను అని మమతా బెనర్జీ అన్నారు.
ముందు మీరేమిటో చెప్పండి .. తర్వాత నాతో హిందూ గేమ్ ఆడొచ్చు
హిందువులు, ముస్లింల మధ్య వివక్ష చూపే బిజెపి నాయకులు ముందుగా మీరు మంచి హిందువు అవునో కాదో నిరూపించుకోవాలన్నారు . ఆపై మీరు నాతో హిందూ గేమ్ ఆడవచ్చు అంటూ మమతా బెనర్జీ అన్నారు. తాను హిందూ మహిళనని చెప్పిన మమత బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తమ ఆత్మలను గుజరాత్ నుండి వచ్చిన బయటివారికి అమ్మినవారు మత కార్డును వాడుకోవడం ద్వారా నందిగ్రామ్ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. ప్రజల స్పందన కారణంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని ఆమె చెప్పారు.
నందిగ్రామ్ లో నేను బయటి వ్యక్తినా .. గుజరాత్ నుండి వచ్చిన వారు అంతర్గత వ్యక్తులా ?
నందిగ్రామ్లో ఆమెను బయటి వ్యక్తి అని పిలిచేవారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం మాట్లాడుతూ గుజరాత్ నుండి వస్తున్న వారు అంతర్గత వ్యక్తులు, తాను బయట వ్యక్తినా అని ప్రశ్నించారు. తాను పొరుగున ఉన్న బీర్భమ్ జిల్లాలో పుట్టి పెరిగానని తనను బయటి వ్యక్తి అని పిలిచే వ్యక్తి కూడా ఇక్కడ పుట్టలేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తనను బయట వ్యక్తి అనిపిలిచే వ్యాఖ్యలను ఖండించారు.
సువేందు అధికారిపై విరుచుకుపడిన మమత
కొంతకాలం క్రితం బిజెపిలో చేరిన తన మాజీ విశ్వసనీయ సువేందు అధికారిపై మమతా బెనర్జీ మండిపడుతున్నారు. తనని తాను భూమిపుత్రుడు అని చెప్పుకుంటున్న సువేందు అధికారి పై నిప్పులు చెరిగిన మమతాబెనర్జీ బయటి వ్యక్తుల పార్టీలో చేరిన సువేందు అధికారి భూమి పుత్రుడను అని ఆ విధంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.