బెంగాల్లో దీదీయే.. మోడీ చరిష్మా పనిచేయదు: ప్రశాంత్ కిశోర్
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ తెరపైకి వచ్చారు. బెంగాల్లో మోడీ, మమతా మధ్యే పోటీ అని స్పష్టంచేశారు. పార్టీలు మారిన వాళ్ల ఎలాంటి మార్పు రాదని అభిప్రాయపడ్డారు. దేశంలో మోడీ ఎంతో పాపులర్ అని, దానిని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. బెంగాల్లో దీదీ పాపులారిటీ ముందు మోడీ పాపులారిటీ పనిచేయదన్నారు.
మోడీకి దేశంలో పాపులారిటీ
బెంగాల్లో సీఎం పీఠం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. గుర్తింపు కలిగిన మమతా బెనర్జీకే ప్రయోజనం చేకూరుతుంది. మోడీకి దేశంలో ఎంత పాపులారిటీ ఉన్నా ఇక్కడ అది అంతగా పనిచేయదని పీకే పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల కోసం బీజేసీ 5 పద్ధతులను అవలంబిస్తోంది. మొదటిది పోలరైజేషన్.. అంటే వివిధ వర్గాలను ఏకీకృతం చేసి తనవైపు తిప్పుకోవడం. రెండోది మమతా బెనర్జీ ప్రాభవాన్ని తగ్గించి ప్రజల్లో ఆమెపై ఆగ్రహం పెంచడం. మూడోది టీఎంసీని అన్నిరకాలుగా పతనం చేయడం. నాలుగోది రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల మద్దతు పొందడం. ఐదోది మోదీ పాపులారిటీని బెంగాల్లో వాడుకోవడమేనని పీకే అన్నారు.
ఇంతకుముందు ఇలా గెలిచింది
ఇంతకుముందు వివిధ రాష్ట్రాల్లో పోలరైజేషన్ జరిగిన ప్రతి సారీ బీజేపీ గెలిచిందని పీకే చెప్పారు. 2002లో గుజరాత్ ఎన్నికలు, బాబ్రా మసీదు వివాదం తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలే దీనికి ఉదాహరణగా పీకే వివరించారు. రెండు సందర్భాల్లో బీజేపీకి 50-55 శాతం ఓట్లు లభించాయని అన్నారు. బెంగాల్ అలా కాదని, ఇక్కడ అధికార పీఠం అధిష్టించాలంటే కనీసం 60 శాతం ఓటింగ్ కావాలని, అందులో స్థానికంగా అధికార పార్టీ అయిన టీఎంసీకి పూర్తి అడ్వంటేజ్ ఉందని పీకే చెప్పారు. మమత ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించినా.. అది అంతగా పనిచేయలేదని, బెంగాల్లో పదేళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీపై సాధారణంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత, కోపం ఉంటాయని, కానీ ఆ కోపం స్థానిక నాయకులపై తప్ప మమతపై ప్రజల్లో ఆగ్రహం లేదని పీకే చెప్పారు.
పార్టీ పతనం కాదు..
పార్టీని పతనం చేసేందుకు, ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీ నుంచి లాగేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, దాదాపు 20-25 మంది పార్టీ నేతలను తమవైపు తిప్పుకుందని, కానీ 230 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎంపీలు ఉన్న టీఎంసీకి అంతమంది నేతలను కోల్పోవడం కొంత దెబ్బే అయినా.. పార్టీ పతనం కాదని పీకే వివరించారు. ఇక ఎస్సీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ గత ఎన్నికల్లో విజయం సాధించింది.
దీదీకే ఎక్కువ
మోడీ చరిష్మాతో పోల్చితే బెంగాల్ దీదీకే ఎక్కువ చరిష్మా ఉందని అందువల్ల ఈ సారి కూడా రాష్ట్రంలో టీఎంసీ గెలుపు ఖాయమని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు బీజేపీ అంటే బెంగాల్ ప్రజల్లో భయాన్ని పెంచిందని, రాష్ట్రంలో టీఎంసీ గెలవకపోతే ప్రజల జీవితాలను సైతం నియంత్రిస్తుందనే ఆందోళన ప్రజల్లో కలిగించిందని అన్నారు. ఒకటే దేశం, ఒకటే పార్టీ విధానానికి ఇక్కడి నుంచే నాంది పడే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రత్యేకం ఇందుకే
బెంగాల్ ఎన్నికలు ప్రత్యేకమని, గత 30-35 ఏళ్లలో బెంగాల్లోని అధికార పార్టీకి ఒక్కసారి కూడా జాతీయ పార్టీ నుంచి పోటీ ఎదురు కాలేదని చెప్పారు. లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడూ పోటీనివ్వలేదని, కానీ ఇప్పుడు అధికార టీఎంసీకి జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి పోటీ ఎదురవుతోందని అందుకే ఈ సారి ఎన్నికలు ప్రత్యేకమైనవని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ.. రాష్ట్రంలోని అధికార పార్టీపై పోరుకు సిద్ధమైంది. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పోల్చితే బెంగాల్ ఎన్నికలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని పీకే పేర్కొన్నారు.