గర్ల్ఫ్రెండ్ పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకు ట్వీట్... ఆ పని చేస్తే రుణపడి ఉంటానని...
సీత కష్టాలు సీతవి... పీత కష్టాలు పీతవి అనే ఒక సామెత... బిహార్కు చెందిన ఓ యువకుడు చేసిన ట్వీట్ ఇదే సామెతను గుర్తుచేసేలా ఉంది. జనమంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. లాక్ డౌన్లో తన గర్ల్ఫ్రెండ్కి పెళ్లి అయిపోతోందని ఆ యువకుడు ఆవేదన చెందుతున్నాడు. అంతేనా... దీనిపై ఏకంగా ముఖ్యమంత్రికే ట్వీట్ చేశాడు. సార్.. లాక్ డౌన్ విధిస్తే విధించారు... పనిలో పనిగా వివాహాలపై కూడా నిషేధం విధించండి సార్.. అలా అయితే నా గర్ల్ఫ్రెండ్ పెళ్లి వాయిదా పడుతుంది.. అంటూ సీఎంకు విజ్ఞప్తి చేశాడు.
బిహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే నెటిజన్ చేసిన ఈ ట్వీట్ ట్విట్టర్లో నవ్వులు పూయిస్తోంది. గత వారం బిహార్లో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లాక్ డౌన్ను మే 25 వరకు పొడగించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.సీఎం ట్వీట్పై స్పందించిన పంకజ్ కుమార్... 'సార్.. పనిలో పనిగా వివాహాలపై కూడా నిషేధం విధిస్తే ఈ నెల 19న జరగాల్సిన నా గర్ల్ఫ్రెండ్ పెళ్లి కూడా వాయిదా పడుతుంది. అలా చేస్తే నేను మీకు రుణపడి ఉంటాను సార్...' అంటూ సీఎంకు ట్వీట్ చేశాడు.
ఆశ్చర్యంగా పంకజ్ ట్వీట్కు నవ్య కుమారి అనే నెటిజన్ రిప్లై ఇచ్చింది.'హే పంకజ్.. నువ్వు నన్ను వదిలేసి పూజతో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు... నేను కూడా చాలా ఏడ్చాను. ఇవాళ నేను సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకు. కానీ పంకజ్.. నేనెవరిని పెళ్లి చేసుకున్నా... నా మనసులో మాత్రం ఎప్పటికీ నువ్వే ఉంటావు. నా పెళ్లికి నువ్వు రావాలి. పెళ్లిలో నువ్వు నన్ను చూడాలని కోరుకుంటున్నా.' అని పేర్కొంది.
పంకజ్-నవ్య ట్వీట్లు చూసి కొంతమంది ఆ ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయిందేదో అయిపోయింది... ఇలా ట్విట్టర్లోకి ఎక్కి గొడవెందుకు... అనవసరంగా పెళ్లి చెడగొట్టుకున్నట్లువుతుంది.. అంటూ కొంతమంది సలహాలు ఇచ్చారు. ఇంతలో పంకజ్ నవ్య ట్వీట్కు రిప్లై ఇస్తూ... 'ఇంతకీ ఎవరు సిస్టర్ మీరు...' అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు షాక్ తిన్నారు. పంకజ్ ట్వీట్పై స్పందించిన నవ్య... 'గులాబ్ కోసం ఆరాటపడి గులాబ్ జామ్ను పోగొట్టుకున్నావు.' అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. దీంతో నెటిజన్లకు వీరిద్దరి మధ్య అసలేం జరుగుతుందో తెలియక జుట్టు పీక్కున్నారు.
కాగా,దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఉన్నప్పటికీ తక్కువ మందితో వివాహ కార్యక్రమాలకు ప్రభుత్వాలు అనుమతినిస్తున్నాయి. దీంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పంకజ్ కుమార్ తన గర్ల్ఫ్రెండ్ పెళ్లిపై ఇలా ట్వీట్ చేశాడు.