అమానుషం: గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని కొట్టి చంపారు
రాజస్థాన్: ఓవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గోసంరక్షకులు హత్యలకు పాల్పడుతున్నారు అనే అంశంపై చర్చ జరుగుతుండగానే రాజస్థాన్లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన ఓ 28 ఏళ్ల వ్యక్తి ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తు కొందరు గోసంరక్షులు ఆ వ్యక్తిని కొట్టి చంపారు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్లో చోటుచేసుకుంది.
అక్బర్ ఖాన్ అనే వ్యక్తి రెండు ఆవులను హర్యానాలోని తన గ్రామానికి తీసుకెళుతుండగా... కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తీవ్రగాయాలతో అక్బర్ మృతిచెందాడు. ఖాన్ ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆయనపై దాడి చేసిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అయితే అది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఖాన్తో పాటు వచ్చిన అతని స్నేహితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
తీవ్రగాయాలతో పడిఉన్న ఖాన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు చెప్పిన వైద్యులు... ఆయన కుటుంబసభ్యులు రాగానే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే జరిగిన ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఖాన్పై దాడి చేసిన ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగతావారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తెలిపారు. మరోవైపు దేశంలో ముస్లింగా పుట్టడమే నేరమైందని..వారిని అంతమొందిస్తున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మండిపడ్డారు. నాలుగేళ్ల మోడీ పాలన అంటే కేవలం హత్యలే అని ఆయన ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.