మలాశయంలో బంగారం దాచి.. శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు
ముఖ్యంగా అతని నడకతీరులో మార్పును గుర్తించిన అధికారులు మరింత నిశితంగా అతన్ని పరీక్షించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది.
హైదరాబాద్: నగర శివారులో ఉన్న శంషాబాద్ విమానశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. బంగారం ఎవరి కంటపడకుండా అత్యంత గోప్యంగా తరలించడానికి ఏకంగా పురీషనాళంలో(మలాశయం) బంగారాన్ని దాచిపెట్టి తరలిస్తుండటం గమనార్హం.
పోలీసుల తనిఖీల్లో సదరు వ్యక్తి నుంచి దాదాపు 1.19కేజీల బంగారం బయటపడింది. గ్రీన్ చానెల్ మార్గం నుంచి ఎయిర్ పోర్టు బయటకు వెళ్లబోతున్న ఓ ప్రయాణికుడిని ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీ చేయగా.. అతని పురీశనాళంలో ఆరు గోల్డ్ బిస్కెట్లు ఉన్నట్టుగా గుర్తించారు.
భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఆ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.34.46లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. సదరు ప్రయాణికుడు జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా రాజీవ్ గాంధీ విమానశ్రయానికి వచ్చాడు. నిందితుడిని ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తన వద్ద సుంకం చెల్లించాల్సిన వస్తువులేవి లేవని గ్రీన్ చానెల్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడానికి సిద్దమవుతున్న తరుణంలో.. అధికారులకు అతని పట్ల అనుమానం కదలింది. ముఖ్యంగా అతని నడకతీరులో మార్పును గుర్తించిన అధికారులు మరింత నిశితంగా అతన్ని పరీక్షించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది.
విమానం మరికొద్ది సేపట్లో ల్యాండవబోతుందనగా.. బాత్రూంలోకి వెళ్లి ఆ బంగారు కడ్డీలను తన పురీషనాళంలోకి జొప్పించినట్టుగా అధికారులు గుర్తించారు. విమానశ్రయం నుంచి బయటపడ్డ మరుక్షణం వాటిని బయటకు తీయాలని అనుకున్నాడు. ఇంతలోనే అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications