భారత్లో తొలి ఎబోలా కేసు, ఆందోళన: ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: భారత్లో తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి ఇక్కడికి వచ్చిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాధితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
"నవంబర్ 10వ తేదీన లైబీరియా నుంచి ఇక్కడికి చేరుకున్న 26ఏళ్ల వ్యక్తి వీర్య నమూనాలు పరీక్షించగా ఎబోలా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో అతడిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నాం" అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రాణాంతక వ్యాధికి సంబంధించి బాధితుడు గతంలో లైబీరియాలో చికిత్స కూడా తీసుకున్నాడని వివరించింది. వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాత ఇక్కడికి వచ్చాడని... ఐతే ఇక్కడ జరిపిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు బయట పడ్డాయని పేర్కొంది.
ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు బాధితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాజస్ధాన్లో మరో అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి జయపురలోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు.
అనుమానిత వ్యక్తి జయపుర నగరంలోని విద్యాధర్నగర్కు చెందిన మొహమ్మద్ రెహన్ ఖాన్గా గుర్తించారు. జ్వరం, బొబ్బలతో ఇబ్బందిపడుతున్న మొహమ్మద్ రెహన్ ఖాన్ను తొలుత ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మొహమ్మద్ రెహన్ ఖాన్ బంధువులతో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.