‘‘చెయ్యను.. చేస్తా..’’: రాజీనామాపై మణిపూర్ సీఎం భిన్న ప్రకటనలు
రాజీనామా చేయడానికి మొదట తిరస్కరించిన మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్.. అంతలోనే మనసు మార్చుకున్నారు. మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఇంఫాల్: మణిపూర్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. 60 సీట్లున్న మణిపూర్ లో అధికార కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది.
మరోవైపు 21 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల(11) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం మణిపూర్ లో హై డ్రామా చోటు చేసుకుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా చేసిన సూచనను ఆ రాష్ట్ర ముఖ్యమంతి ఒక్రమ్ ఇబోబి సింగ్ తొలుత తిరస్కరించారు.
తనకు మెజారిటీ ఉందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన దిగొచ్చారు. 24 గంటల్లో తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని, మొత్తం 32 మంది ఎమ్మెల్యేల బలం తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు కలసి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కోరారు. ఆ 32 మంది ఎమ్మెల్యేలను కూడా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి ఇబోబి కూడా గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరగా ఆమె తిరస్కరించారు. బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనకు సూచించారు.
అయితే రాజీనామా చేయడానికి మొదట తిరస్కరించిన ఇబోబి సింగ్.. అంతలోనే మనసు మార్చుకున్నారు. మంగళవారం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.