ఆప్ని వీడితే.. సీఎం చేస్తారట! 9 గంటల సీబీఐ విచారణ తర్వాత మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ అనంతరం మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీని వీడాలని సీబీఐ తనపై ఒత్తిడి పెడుతోందని సిసోడియా ఆరోపించారు. సీబీఐ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. చట్టపరంగా తమ పని తాము చేస్తున్నామని పేర్కొంది.

ఆప్ వీడాలని ఒత్తిడి: సీబీఐపై సిసోడియా ఆరోపణలు
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసుకు సంబంధించి తొమ్మిది గంటలకు పైగా విచారించిన అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు మొత్తం నకిలీదని అన్నారు. "సీబీఐ కార్యాలయం లోపల నన్ను ఆప్ను విడిచిపెట్టమని అడిగారు. లేకుంటే నాపై ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉంటాయి. నాకు 'సత్యేందర్ జైన్ కే ఉపర్ కోన్సే సచ్చే కేసులు హై' అని చెప్పారు. నేను ఆప్ని వదిలి బీజేపీకి వెళ్లనని చెప్పాను. నన్ను సీఎం చేస్తానని చెప్పారు' అని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా, మనీలాండరింగ్ కేసులో జైన్ జైలులో ఉన్నారు.

తొమ్మిది గంటలకుపైగా సిసోడియాను విచారించిన సీబీఐ
సోమవారం ఉదయం 11.15 గంటలకు ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సిసోడియా.. ఢిల్లీలో 'ఆపరేషన్ లోటస్'ను విజయవంతం చేయాలని బీజేపీ కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తాము ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని అన్నారు.మంగళవారం సిసోడియాను సీబీఐ విచారణకు పిలవలేదు.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, వ్యాపారవేత్త విజయ్ నాయర్తో సహా ఇతర నిందితులతో ఆయనకున్న సంబంధాలు, ఈ కేసులో సోదాల్లో లభించిన పత్రాలపై డిప్యూటి సీఎం సిసోడియాను తొమ్మిది గంటలకు పైగా విచారించారు.
ఈ కేసులో వైఎస్సార్సీపీ లోక్సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది.
భారీ ర్యాలీగా సీబీఐ కార్యాలయానికి సిసోడియా
సీబీఐ ప్రధాన కార్యాలయానికి రాకముందు సిసోడియా ఉదయం రాజ్ఘాట్ను సందర్శించారు. ఆయన నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమిగూడి, సీబీఐ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఆయనతో కలిసి చేరారు. సీబీఐ కార్యాలయం వెలుపల నిరసనకు దిగిన ఎంపీ సంజయ్ సింగ్తో సహా పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సిసోడియాను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ తో పోల్చడంపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి కుంభకోణంలో నిందితుడిని స్వాతంత్ర్య కోసం పోరాడిన యోధుడితో పోలుస్తారా అంటూ భగత్ సింగ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

మనీష్ సిసోడియా ఆరోపణలను ఖండించిన సీబీఐ
సిసోడియా వాంగ్మూలాన్ని ధృవీకరిస్తామని, దర్యాప్తు అవసరాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేగాక, సిసోడియా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సిసోడియాను ప్రశ్నించడం అనేది వృత్తిపరమైన, చట్టపరమైన పద్ధతిలో జరిగిందని స్పష్టం చేసింది. చట్ట ప్రకారమే విచారణ కొనసాగుతోందని తేల్చి చెప్పింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అనుమతి లేకుండానే కొత్త విధానాన్ని తీసుకొచ్చారని సీబీఐ వాదిస్తోంది. చాలా మంది అనర్హులకు ఢిల్లీ ప్రభుత్వం లంచాలకు బదులుగా లైసెన్స్లు మంజూరు చేసిందని ఆరోపించింది. గతేడాది నవంబర్లో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఎనిమిది నెలల తర్వాత అవినీతి ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications