బిల్లు పెడ్తాం: టిపైప్రధాని, సుష్మాVsకమల్, చిరు డుమ్మా
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పందించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెడతామని చెప్పారు. అందరి ఆమోదంతో తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటు ఇరు సభల్లో ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. బిల్లుకు అందరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరమే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదన్నారు. అవినీతి నిరోధక, మతహింస బిల్లు కూడా ప్రవేశ పెడతామని చెప్పారు.
సుద్దులొద్దు: మళ్లీ కమల్ వర్సెస్ సుష్మా స్వరాజ్
ఫ్లోర్ లీడర్ల సమావేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకురాలు, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ల మధ్య తెలంగాణ విషయంలో వాదన జరిగింది. తెలంగాణ ఏర్పాటు ఖాయమని కమల్ నాథ్ అన్నారు.
ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. పార్లమెంటు సజావుగా సాగకుంటే కాంగ్రెసు పార్టీ తమకు ప్రవచాలు చెప్పాల్సిన పని లేదని అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో పెడితే తమ ఎంపీలు గందరగోళం సృష్టించరని, కాంగ్రెసు ఎంపీలే గందరగోళం చేస్తారన్నారు.
జివోఎం సమావేశం
నార్త్ బ్లాక్లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంత్రుల బృందం (జివోఎం) మంగళవారం సాయంత్రం రెండున్నర గంటలకు భేటీ అయింది. ఈ భేటీకి సీమాంధ్ర కేంద్రమంత్రులను ఆహ్వానించారు. దీంతో భేటీకి కావూరి సాంబశివ రావు, దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు హాజరయ్యారు. కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, పళ్లం రాజులు హాజరు కాలేదు.
ముఖ్యమంత్రి దీక్షపై దిగ్విజయ్
మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టరని తాను భావిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపిన తరువాతే తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామని, ఇప్పుడు పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నట్టు తాము వెనక్కి తగ్గమన్నారు. కిరణ్ కాంగ్రెస్ వ్యక్తి అని, ఆయన దీక్ష చేపట్టే అవకాశం లేదని, వారి అనుమానాలు నివృత్తిచేస్తామన్నారు.