ముహూర్తం ఫిక్స్: హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీగా దుష్యంత్ ప్రమాణాస్వీకారం
హర్యానా: హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి మనోహర్లాల్ ఖట్టర్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఖట్టర్ను బీజేపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ను కలిసిన తర్వాత ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ చెప్పారని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా తన రాజీనామాను గవర్నర్కు అందజేసినట్లు చెప్పిన ఖట్టర్ ఆదివారం రోజున మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు వేదికగా రాజ్భవన్ ఉంటుందని చెప్పారు. అదే సమయంలో జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.
గురువారం వెలువడిన ఫలితాలతో హర్యానాలో బీజేపీ 40 స్థానాలు మాత్రమే గెలిచి మ్యాజిక్ ఫిగర్కు ఆరు సీట్ల దూరంలో నిలించింది. దీంతో జేజేపీ బీజేపీకి ఆపన్న హస్తం అందించింది. 10 సీట్లు గెలిచిన జేజేపీ బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటిచింది. హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాము భావించినట్లు దుశ్యంత్ చౌతాలా చెప్పారు. ఇదిలా ఉంటే మనోహర్లాల్ ఖట్టర్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా సభ్యులు ఎన్నుకున్నారు.