మరాఠా రిజర్వేషన్ ఆందోళన హింసాత్మకం, రాళ్ల దాడిలో పోలీసు మృతి, ఆత్మహత్య!
ముంబై: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మరాఠాలు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆత్మహత్యాయత్యం చేసిన వ్యక్తి బుధవారం మరణించడంతో శాంతియుతంగా జరుగుతున్న బంద్ హింసాత్మకంగా మారింది.
రిజర్వేషన్లు కల్పించాలని మంగళవారం మరాఠాలు ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో జగన్నాథ్ అనే వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు తీవ్రఅస్వస్తతకు గురైన జగన్నాథ్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై బుధవారం జగన్నాథ్ మరణించాడు.
రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మరాఠా క్రాంతి మోర్చా బుధవారం శాంతియుత బంద్ కు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం నుంచి మహరాష్ట్రలో శాంతియుతంగా బంద్ నిర్వహించారు. చికిత్స విఫలమై జగన్నాథ్ మరణించాడని వెలుగు చూడటంతో బంద్ హింసాత్మకంగా మారిపోయింది.
రిజర్వేషన్లు కల్పించడంతో మహరాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ కాకాసాహేబ్ షిండే (26) అనే యువకుడు సోమవారం ఔరంగాబాద్ సమీపంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.
బుధవారం మరాఠాలు పలు వాహనాలు ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పంటించారు. యువకులు రోడ్ల మీద టైర్లకు నిప్పంటించారు. కాయ్ గావ్ ప్రాంతంలో పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో ఆందోళనకారులు రాళ్లతో దాడి చెయ్యడంతో శ్యాం అట్టావోంకర్ అనే పోలీసు మరణించాడు. మరో పోలీసుకు తీవ్రగాయాలైనాయి. బంద్ సందర్బంగా ప్రభుత్వ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.