మ్యారిటల్ రేప్: భారత్లో వైవాహిక అత్యాచారాలపై ఎందుకు చర్చ జరుగుతోంది
ఉత్తర్ప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల రీతు (పేరు మార్చాం) పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు, తనకు కాబోయే భర్త గురించి వారి కుటుంబం గురించి రీతూకు తెలియదు.
పెళ్లి తర్వాత, ఆమె భర్త గురించి, ఆయన చేసే పని గురించి ఆమెకు తెలిసింది. అతనితో శారీరక కలయిక ఆమె అసౌకర్యంగా ఉండేది.
రీతూ నిరాకరించినప్పటికీ, ఆమె భర్త బలవంతంగా ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా హింసించారు. చాలా సార్లు మత్తుమందులు ఇచ్చి ఆమె స్పృహలో లేని సమయంలో తన కోరిక తీర్చుకునేవారు.
భర్త బలవంతం చేస్తున్నాడని, తనకు చాలా నొప్పిగా బాధగా ఉంటుందని తన తల్లితో రీతూ చెప్పగా... అది బలవంతం కాదు, భార్యాభర్తల మధ్య ఇది సహజమేనని ఆమె నచ్చజెప్పారు. నువ్వు తిరస్కరించడం వల్లే ఆయన అలా చేసి ఉంటారని అన్నారు.
భారత్లో కరోనా తొలి వేవ్ ప్రారంభమైనప్పుడు 2020లో ఇదంతా జరిగింది.
రీతూకి డాక్టర్ డాలీ సింగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ''ఈ విషయంలో రీతూకు కుటుంబ సభ్యుల సహకారం లభించలేదు. ఇది మీ ఇంటి గొడవ, మీరే సర్దుకోండి అని రీతూకు సలహాలిచ్చారు. ఆమె భర్త, రీతూను చావబాది గదిలో పెట్టి తాళం వేశారు'' అని ఆమె వివరించారు.
''గదిలో బంధించిన సమయంలో రీతూకు యూట్యూబ్ ద్వారా మా సంస్థ గురించి తెలిసింది. ఆమె మమ్మల్ని సంప్రదించారు'' అని చెప్పారు.
లైంగిక వేధింపులు, హింసకు గురైన బాధిత మహిళల కోసం ఎన్జీవో సంస్థ 'శక్తి శాలిని' పని చేస్తుంది. భారతీ సింగ్ దీన్ని నెలకొల్పారు.
- భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే భర్త రేప్ చేసినట్లేనా
- 'వాళ్లు నన్ను బంధించి 25 రాత్రుళ్లు రేప్ చేశారు’
కోల్కతాలోని తూర్పు రీజియన్ ప్రాంతంలో ఈ సంస్థ పనులను డాలీ సింగ్ చూసుకుంటున్నారు. ''పెళ్లి తర్వాత ఇష్టం లేకున్నా శారీరక కలయిక కోసం బలవంతం చేయడాన్ని 'మ్యారిటల్ రేప్' లేదా 'వైవాహిక అత్యాచారం' అంటారనే సంగతి రీతూకు తెలియదు. కానీ బలవంతపు సంబంధం కచ్చితంగా తప్పు అని మాత్రం ఆమెకు తెలుసు'' అని డాలీ చెప్పారు.
ఈ సంస్థ సహాయంతో రీతూ ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఒక కాల్ సెంటర్లో ఆమె పనిచేస్తున్నారు. తన కుటుంబానికి, అత్తింటివారికి ఆమె దూరంగా ఉన్నారు.
వైవాహిక జీవిత బాధ్యత
డాలీ చెప్పిన ప్రకారం రీతూ చాలా ధైర్యవంతురాలు. కానీ, ఇలాంటి బలవంతపు బంధాలు తమ విధిరాత అని భావిస్తూ, వైవాహిక జీవితంలో ఇవన్నీ సాధారణమేనని, దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనదేనని నమ్ముతూ జీవితాంతం ఈ బాధను అనుభవించే మహిళలు చాలా మంది ఉన్నారు.
వీరంతా కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి ముందుకు రాలేరు. చాలా కేసుల్లో అత్తింటివారు, తమ కోడలు ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితిని ఒక సమస్యగా భావించరు. అది సాధారణమనే అనుకుంటారు. మహిళలు ఈ పరిస్థితిని ఎదురించి బయటకు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం.
దిల్లీ హైకోర్టులో పిటిషన్లు
వైవాహిక అత్యాచారాల గురించి దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టు ఇటీవలే విచారించింది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 375లోని రెండో మినహాయింపును ఈ పిటిషన్లలో సవాలు చేశారు.
దీనిపై కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కేంద్రం తాజాగా అఫిడవిట్ను సమర్పించింది. చట్టంలో ప్రతిపాదిత సవరణపై చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశానికి సంబంధించి పిటిషనర్లు తగిన సూచనలు ఇవ్వొచ్చని అఫిడవిట్లో పేర్కొంది.
అంతేకాకుండా, ఈ అంశానికి సంబంధించి అన్ని పక్షాలతో సంప్రదింపులు పూర్తయ్యేవరకు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించొద్దని హైకోర్టును కేంద్రం కోరింది.
ఐపీసీలోని సెక్షన్ 375, అత్యాచారాన్ని నిర్వచించింది. దాన్ని నేరంగా పరిగణించింది. కానీ ఈ సెక్షన్లోని రెండవ మినహాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైనే పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఐపీఎస్ సెక్షన్ 375లోని రెండో మినహాయింపు, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించదు. 15 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన భార్యతో భర్త శారీరక సంబంధంలో పాల్గొనడాన్ని అనుమతిస్తుంది. భార్య సమ్మతి లేకపోయినా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్ని నేరంగా పరిగణించదు. దాన్ని రేప్గా భావించదు.
అయితే 2017లో సుప్రీంకోర్టు, ఈ వయసు నిబంధనను 15 నుంచి 18 ఏళ్లకు పెంచింది.
ఇష్టం లేకుండా ఏర్పడే శారీరక సంబంధాన్ని కూడా అత్యాచారం నిర్వచనంలో చేర్చాలని జస్టిస్ వర్మ కమిటీ నివేదిక పేర్కొంది.
నిజానికి నిర్భయ ఘటన తర్వాత, వైవాహిక అత్యాచారానికి కూడా ప్రత్యేక చట్టం ఉండాలంటూ జస్టిస్ వర్మ కమిటీ డిమాండ్ చేసింది.
పెళ్లి తర్వాత సెక్స్లో పాల్గొనడంపై మహిళల సమ్మతి, అసమ్మతిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన వాదించారు.
- సినీ నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
భారత్లో చట్ట రీత్యా వైవాహిక అత్యాచారం నేరం కాదు. అందుకే ఐపీసీలోని ఏ సెక్షన్లో కూడా దీన్ని నిర్వచించలేదు. దీనికి సంబంధించిన శిక్షల గురించి ప్రస్తావించలేదు.
దిల్లీ హైకోర్టులో నమోదైన పిటిషన్లలో, ఐపీసీ సెక్షన్ 375లోని 2వ మినహాయింపు రాజ్యాంగబద్ధతను సవాలు చేశారు. భారత రాజ్యాంగంలోని 14, 15, 19, 21 ఆర్టికల్స్ను ఇది ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. దీన్ని నిర్హేతుకంగా అభివర్ణించారు.
వైవాహిక అత్యాచారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో డాక్టర్ చైత్ర అవస్థి ఒకరు. మహిళా సాధికారత కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ 'ఆర్ఐటీ' ఫౌండేషన్ను ఆమె స్థాపించారు.
''కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో నాకు తెలియదు. కానీ ఇది కచ్చితంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తుంది'' అని ఆమె అన్నారు.
- ఇద్దరు హైదరాబాద్ మహిళల యధార్ధ గాథ: 'పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- విశాఖ: 'పుస్తకాలు, అట్టల కోసం ఇంటికి రమ్మని 14 మంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు’
వైవాహిక జీవితంలో సెక్స్ గురించి మాట్లాడటం నిషిద్ధం
వైవాహిక అత్యాచార బాధితురాలు ఒకరు కూడా దీనిపై పిటిషన్ దాఖలు చేశారని భారతీ శర్మ చెప్పారు. ప్రతి నెలా తన వద్దకు 10 నుంచి 15 కొత్త కేసులు వస్తుంటాయని, అందులో 50 శాతం కేసులు వైవాహిక అత్యాచారానికి సంబంధించినవే ఉంటాయని ఆమె తెలిపారు.
''వివాహ బంధంలో సమస్యల పరిష్కారం కోసం మహిళలు మా వద్దకు వస్తుంటారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు, వైవాహిక అత్యాచారానికి కూడా గురైనట్లు మాకు చెబుతారు. ఆ బాధ గురించి చెప్పేటప్పుడు విపరీతంగా ఏడుస్తారు. వారిని ఓదార్చడం చాలా కష్టం'' అని ఆమె వివరించారు.
ప్రస్తుత భారతీయ సమాజంలో సెక్స్ గురించి, మరీ ముఖ్యంగా భార్యభర్తల మధ్య శారీరక సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడటం నిషేధమని భారతీ అన్నారు. ''ఇలాంటి పరిస్థితుల్లో ఏ మహిళ అయినా వైవాహిక అత్యాచారం గురించి బహిరంగంగా మాట్లాడతారా? అది అసలు జరిగే పనే కాదు. అందుకే చాలా మంది మహిళలు దీని గురించి నోరెత్తరు'' అని ఆమె అన్నారు.
''వైవాహిక అత్యాచారం గురించి తల్లిదండ్రులతో చెప్పినప్పుడు, వారు మౌనంగా ఉండిపోతారు. లేదా నువ్వు అందుకు అంగీకరించకపోతే వారు బయటి వ్యక్తుల వైపు చూస్తారు అని హెచ్చరిస్తారు.''
'' మహిళలకు ఇళ్లే సురక్షితమైన ప్రదేశమని నమ్మే ఈ సమాజంలో, ఒక మహిళ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చాలా పెద్ద విషయం'' అని ఆమె తెలిపారు.
వైవాహిక అత్యాచారంపై సమాజంలో భిన్న స్పందనలు
ట్విట్టర్లో వైవాహిక అత్యాచారం అనే అంశం ట్రెండ్ అయినప్పుడు దీనిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడగా, మరికొందరు దీన్ని తీవ్రంగా ఖండించారు.
ఒకవేళ ఇలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసినప్పుడు, తాము బాధితులమని మహిళలు ఎలా రుజువు చేసుకోగలుగుతారు? తాము తప్పుచేయలేదని పురుషులు ఎలా ఆధారాలు చూపగలరు? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయ.
https://twitter.com/DeepikaBhardwaj/status/1484012125458960387
భర్త నుంచి విడిపోవాలనుకున్న మహిళలు దీన్ని అదునుగా తీసుకునే అవకాశముందనే చర్చలు కూడా జరిగాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇలాంటి కేసులు తలెత్తితే పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు.
https://twitter.com/TheAmitLakhani/status/1483704427320020992
''వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై సమాజంలోని ఒక వర్గం మాపై ఆగ్రహంతో ఉంది. వారికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉండకపోవచ్చు. కానీ దీనివల్ల చేదు అనుభవాలు ఎదుర్కొన్న మహిళలు చాలామంది ఉన్నారు. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం'' అని డాక్టర్ చిత్రా అవస్థీ పేర్కొన్నారు.
https://twitter.com/jyotitiwari05/status/1483734615374241795
సెక్స్ వర్కర్ సమ్మతిని పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు, సొంత భార్యకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదని వాదించేవారు కూడా ఉన్నారు.
https://twitter.com/HusbandInLawyer/status/1483868107014033408
''సెక్స్ వర్కర్ నుంచి అనుమతి తీసుకుంటారు. అది ఒక వ్యాపారం. కానీ తలుపులు మూసేశాక లోపల ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. భర్తను సంతోషపెట్టడం భార్య బాధ్యత అనేది చిన్నప్పటి నుంచే ఆడపిల్లల మనసుల్లో నాటుతారు. ఇక వారి అంగీకారం, సమ్మతి గురించి ఎవరు అడుగుతారు'' అని భారతీ అన్నారు.
- అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు... హైకోర్టు నిర్దోషిగా ఎలా విడుదల చేసింది?
- 'అతను నన్ను రేప్ చేశాడు... నేను బడికి వెళ్లను’ - 12 ఏళ్ల బాలిక చెప్పిన చివరి మాటలివి
కోర్టు నిర్ణయాలు
వైవాహిక అత్యాచారాలపై కోర్టు నిర్ణయాల్లో కూడా వైరుధ్యం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జి ఎన్కే చంద్రవంశీ.. భార్యపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి నిర్దోషిగా తీర్పునిచ్చారు.
భార్యపై ఒత్తిడి చేసి, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ భర్త శారీరక సంబంధంలో పాల్గొనడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
సరిగ్గా ఇలాంటి కేసు విషయంలోనే కేరళ హైకోర్టు మరోలా తీర్పు వెలువరించింది. భార్య శరీరంపై తనకు హక్కు ఉందని భావించినా, ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక చర్యలో పాల్గొన్నా దాన్ని వైవాహిక అత్యాచారంగానే భావించాలని చెప్పింది.
ఇది చాలా సున్నితమైన అంశమని సుప్రీం కోర్టు న్యాయవాది రాధికా థాపర్ అన్నారు. ''ఒకవేళ ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును తొలగిస్తే వివాహబంధాలపై ప్రభావం పడుతుంది. తొలగించకపోతే ఇలాంటి బాధితులు ఎక్కువ అవుతారు. దీనిపై తగు నిర్ణయం తీసుకోవడం సుప్రీంకోర్టు ముందున్న పెద్ద సవాలు'' అని ఆమె అన్నారు.
''పెళ్లి అనేది ఒక బంధం. ఇందులో ఇద్దరికి ఒకరిపై ఒకరికి బాధ్యత ఉంటుంది. ఈ బంధంలో మహిళను పురుషుడు తన హక్కుగా భావిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమానత్వం అనే అంశానికి తావు ఉండదు. కాబట్టి దీన్ని సమతుల్యం చేసేలా మధ్యేమార్గంగా ఒక పరిష్కారాన్ని ప్రభుత్వాలు చూపాల్సి ఉంటుంది'' అని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ 'యూఎన్ ఉమెన్' ప్రకారం, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇల్లు కూడా ఒకటి. దాదాపు పది దేశాల్లో కేవలం నాలుగు దేశాలు, మ్యారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయని 2019 నివేదికలో యూఎన్ ఉమెన్ తెలిపింది.
నివేదిక ప్రకారం... అమెరికా, నేపాల్, యూకే, దక్షిణాఫ్రికా సహా 50కి పైగా దేశాలు దీన్ని నేరంగా పరిగణిస్తున్నాయని, ఆసియా ఖండంలోని చాలా దేశాలు ఈ చట్టంలో సవరణలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆ నివేదికలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ముంబయి: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఆరుగురి మృతి
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- దిల్లీ పీఠానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగానే ఎందుకు వెళ్తుంది?
- 'మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)