ఫేస్బుక్ హెచ్ఓను సందర్శించనున్న మోడీ
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 27న అక్కడి ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27 ఉదయం 9.30 నిమిషాలకు మోడీ ఫేస్బుక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ టౌన్హాల్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాని మోడీని గతంలో తాను కలిశానని, ఇలా మరోసారి తమ సొంత కార్యాలయంలో కలవబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ జుకర్బర్గ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మోడీతో కలిసి దిగిన ఫొటోను జుకర్బర్గ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, జుకర్బర్గ్ ఆహ్వానానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్, డిజిటల్ ఇండియా కార్యక్రమాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు.