విగ్రహాలు పెట్టినందుకు డబ్బు డిపాజిట్ చేయాల్సిందే: మాయావతికి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ: ప్రజాధనం ఉపయోగించి తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నందుకు గాను బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి డబ్బులు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేసాలు జారీ చేసింది. ప్రజాధనం ఖర్చు పెట్టడంపై ఆమెకు భారత అత్యున్నత న్యాయస్థానంలోనే గట్టి షాక్ తగిలింది.
మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని యూపీకి చెందిన ఓ లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజాధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు, తన విగ్రహాలను ఆవిష్కరించారని, కాబట్టి రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్ము జమ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇది తాత్కాలిక అభిప్రాయమని, దీనిపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుందని దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.