మోడీ కన్నా నేనే బెటర్.. ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన మాయావతి
ఢిల్లీ : నరేంద్రమోడీని తిరిగి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుచేయకుండా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సంకేతాలిచ్చాయి. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతబెనర్జీ అవసరమైతే రాహుల్ను ప్రధానిని చేస్తామని ప్రకటించగా.. కాంగ్రెస్ సైతం తమకు పీఎం పదవి ఇవ్వకపోయినా పర్వాలేదన్న సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి తొలిసారి ప్రధాని పదవిపై తన మనసులో మాట బయటపెట్టారు. ప్రధానిగా నరేంద్రమోడీ కన్నా తానే బాగా పరిపాలిస్తానని చెప్పుకున్నారు.
నరేంద్రమోడీ ప్రధాని పదవికి అర్హుడు కాదని మాయావతి అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి విషయంలో మోడీ కన్నా తానే బెటర్ అని చెప్పారు. 'బీఎస్పీ హయాంలోనే చేపట్టిన అభివృద్ధి పనులతో ఉత్తర్ప్రదేశ్ రూపు రేఖలు మారిపోయాయి. లక్నో ఎంతో సుందరంగా మారింది. ఈ పనులన్నింటినీ గమనిస్తే దేశం, ప్రజల సంక్షేమం కోసం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ప్రధాని పదవికి అర్హురాలు. నరేంద్రమోడీ అనర్హుడు' అని మాయావతి ప్రకటించారు.

గుజరాత్ సీఎంగా నరేంద్రమోడీ పాలన దేశం చరిత్రపై మాయని మచ్చగా మిగిలిందని మాయావతి విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన పనులకు తనకు తాను ప్రశంసించుకున్నారు బెహన్ జీ. సీఎంగా మోడీ కన్నా తక్కువ సమయమే అధికారంలో ఉన్నా క్లీన్ ఇమేజ్తో ప్రజా సంక్షేమ పాలన అందించానని చెప్పుకున్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి దేశంలోనే అత్యధికంగా అవినీతిపరులున్నది బీజేపీలోనే అని విమర్శించారు.












Click it and Unblock the Notifications