జయలలిత ఆరోగ్యంపై దాస్తున్నారా?: అభిమానుల్లో ఆందోళన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన ఆసుపత్రి వైద్యులు.. హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించిన దాని కంటే ఎక్కువే దాస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జయలలిత గత ఇరవై రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగు పడుతుందని, మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని చెబుతున్నారు. అదే సమయంలో తాజాగా మంత్రులకు ఆమె శాఖల బాధ్యతలు అప్పగించారు. దీనిపై కరుణానిధి ప్రశ్నలు కురిపించారు.
ఇలాంటి సమయంలో, ఆసుపత్రి వర్గాలు ఆమె ఆరోగ్యం పైన బులెటిన్ విడుదల చేస్తున్నప్పటికీ ఏదో దాస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమెకు మరింత మంచి చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లవచ్చుననే పుకార్లు కూడా వచ్చాయి.
జయలలిత ఇన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉండటంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులలో ఆందోళనలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. గత పది రోజులుగా అపోలో ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ అనుమానాస్పదంగా మారడంతో తమిళనాట అమ్మ అభిమానుల్లో ఆందోళన తీవ్రమవుతోంది.
ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆమె ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఎయిమ్స్ నిపుణులు, లండన్ నుంచి వచ్చిన ప్రత్యేకవైద్యుడి ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. దీంతో వైద్యులు, ఆమెను పరామర్శించిన రాజకీయ నాయకులు ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఈ తతంగాన్ని గత 15 రోజులుగా తమిళ ప్రజలు గమనిస్తున్నారు.
అదే సమయంలో ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఏ రాజకీయ నాయకుడు, అనుచరుడు ఆమెను చూడలేదు. వైద్యులను మాత్రమే కలుస్తున్నారు. దీంతో అభిమానుల్లో మరింత దిగులు కనిపిస్తోందని అంటున్నారు.
ఇదే సమయంలో జయలలిత నిర్వహించిన శాఖలన్నీ మంత్రి పన్నీర్ సెల్వంకు బదిలీ చేశారు. ఇది కొంత అనుమానాస్పదంగా కనిపించడానికి తోడు, నేడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లోతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆమెను పరామర్శించేందుకు రావడం వారి అనుమానాలను మరింత బలపరుస్తోంది.
తమిళనాట బీజేపీ పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తమిళనాడుకు వెళ్లిందని అక్కడి మీడియా చెబుతోంది. ఆమె చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూసేందుకు వైద్యులు ఎవరినీ అనుమతించడం లేదు. కేంద్రం ప్రతినిధిగా గవర్నర్ ఇప్పటికే ఆమెను గురించిన నివేదిక కేంద్రానికి అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ చెన్నై చేరుకుని అపోలో వెళ్లవలసిన అవసరం లేదంటున్నారు.
ఇప్పటికే తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల నేతలు ఆమెను పరామర్శించారు. అయితే వారంతా వైద్యులు చెప్పిన వివరాలు చెబుతున్నారు. వైద్యులు... ప్రతిరోజూ ఆమె కొలుకుంటోందని చెబుతూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు.