మెయిల్ను హ్యాక్ చేశారు: ఎన్ఐఏకు మెహిదీ తల్లిదండ్రులు
కోల్కతా: సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఇసిస్) ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహిదీ మసూద్ బిశ్వాస్ను డిసెంబర్ 13న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అతనిని ఆదివారం కోర్టు ముందు హాజరు పర్చగా, ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.
కాగా, మెహిదీ తల్లిదండ్రులను ఆదివారం సాయంత్రం సుమారు 45 నిమిషాలపాటు ఇద్దరు ఎన్ఐఏ అధికారులు విచారించారు. పాఠశాల స్థాయి నుంచి బిశ్వాస్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్పై అతని ఆసక్తి ఎలా ఉండేది, 2014 వరకు కూడా అతడ్ని కోల్కతాలోని తమ ఇంటికి రావాలని ఎందుకు కోరలేదని బిశ్వాస్ తల్లిదండ్రులను అధికారులు అడినట్లు తెలిసింది.
బిశ్వాస్ ఇచ్చిన వివరాలు, అతని తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలను ఎన్ఐఏ అధికారులు సరిపోల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడి ఈ మెయిల్ హ్యాక్ అయిందని బిశ్వాస్ తల్లిదండ్రులు విచారణలో తెలిపినట్లు తెలిసింది. బిశ్వాస్ ఉపయోగించిన కంప్యూర్ను ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తే అన్ని విషయాలు బయటపడతాయని వారికి ఎన్ఐఏ అధికారులు చెప్పినట్లు సమాచారం.
ఈ కేసు విషయంలో ఎన్ఐఏ అధికారులు వివిధ ప్రాంతాల్లో విచారణ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెంగళూరు స్థానిక పోలీసుల సహాయంతో విచారణ కొనసాగిస్తున్న ఎన్ఐఏ, ముంబై, కోల్కతా పోలీసు విభాగాల సహాయాన్ని కూడా తీసుకోనున్నట్లు సమాచారం. బిశ్వాస్ తల్లిదండ్రులను ఐబి అధికారులు కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బిశ్వాస్ ట్విట్టర్ ఫాలోవర్స్లో 60శాతం మంది పశ్చిమానికి చెందిన ముస్లిమేతరులే ఉన్నారని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం తెలిపారు. కాగా, కర్ణాటక డిజిపి ఎల్ పోచౌ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ట్విట్టర్ నిర్వహిస్తున్నట్లు మెహిదీ బిశ్వాస్ తమ విచారణలో అంగీకరించాడని తెలిపారు. అతనికి ఇంగ్లీష్ మాట్లాడే ఉగ్రవాదులకు దగ్గరి సంబంధాలున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
కాగా, మెహదీ.. ఇసిస్ సంస్థకు దక్షిణ భారత దేశంలో కమాండెంట్గా పని చేస్తున్నాడని, షమివిట్నెస్ పేరుతో ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తూ ఆంగ్లం, హిందీ భాషలు తెలిసిన యువకులను తీవ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించామని, మెహదీ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, టర్కీ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ తదితర ప్రాంతాల్లో తీవ్రవాదులు నిర్వహిస్తోన్న కార్యకలాపాలపై మెహదీ ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పారు.
మెహదీ ఉర్దూ, అరబిక్లో ఉన్న తీవ్రవాద సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పొందుపరిచేవాడని, రాత్రుళ్లు క్రియాశీలకంగా పని చేసేవాడని, ట్విట్టర్ ఖాతాను ఎక్కడి నుండి నిర్వహిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచాడని, నిందితుడు షమీవిట్నెస్ అనే ట్విట్టర్ ఖాతాతో పాటుగా, ఈఐఎస్ అల్టాడార్ అనే ఖాతాను తెరిచాడని, ఇసిస్ పేరుతో ఫేస్ బుక్ పుట ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ట్వీట్లను ఎక్కువగా స్మార్ట్ ఫోన్ సహాయంతో నిర్వహించేవాడని తెలిపారు.
బ్రిటన్కు చెందిన చానల్-4 షమీవిట్నెస్ వివరాలు గుర్తించి ప్రకటించిన వెంటనే ట్విట్టర్ ఖాతాను నిలిపివేశాడని అధికారులు తెలిపారు. కేంద్ర ఐబీ బృందాల సహకారంతో నిందితుని నివాస వివరాల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేస్తున్నామని తెలిపారు.