విద్యార్థినులకు టీచర్ వేధింపులు: చితకబాదిన పేరెంట్స్
పాలన్పూర్: పాఠశాలలోని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కీచక టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మెహసనలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందసన్లోని నాకదార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నవేద్ ఫెయిజీ(28) అనే వ్యక్తి సంవత్సర కాలం నుంచి ఇంగ్లీష్ టీచర్గా పని చేస్తున్నాడు.
ఇంగ్లీష్ బోధించడంతోపాటు మూడవ తరగతి క్లాస్ టీచర్గా ఉన్నాడు. ఇతడు తరగతులు లేని సమయంలో విద్యార్థినులను తన వద్దకు పిలిపించుకుని లైంగికంగా వేధింపులకు పాల్పడేవాడు.
అయితే కొందరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఎందుకు పాఠశాలకు వెళ్లడం లేదని ప్రశ్నించడంతో విద్యార్థినులు తమ తమ తల్లులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
కాగా, తనకేమి తెలియదంటూ నిందితుడు నవేద్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే విద్యార్థినులు తమతో ఆ టీచర్ వ్యవహరించిన తీరును చెప్పడంతో అతడు ఏం మాట్లాడలేకపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు నిందితుడ్ని చితకబాదారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల తండ్రిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.