రైలు టిక్కెట్ పై రాయితీలు ఉన్నట్లా - లేనట్లా : రైల్వే మంత్రి కీలక ప్రకటన..!!
రైళ్లల్లో రాయితీలపై ప్రయాణించే వారికి రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. కరోనా పేరుతో రద్దు చేసిన రాయితీలను తిరిగి పునరుద్దరించటం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చింది. రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ టిక్కెట్ల సౌకర్యాన్ని ఇప్పట్లో పునరుద్దిరంచలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లిడించారు. రైల్వేలో ఉద్యోగుల వేతన భారంతో పాటుగా ఫింఛన్లకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పట్లో రాయితీల పునరుద్దరణ సాధ్యం కాదని రైల్వే మంత్రి తేల్చి చెప్పారు. ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఇబ్బందిగా మారుతోంది.
సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై ఇస్తున్న రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన లోక్సభ ఎంపీ నవనీత్ రాణా రైల్వే పార్లమెంట్ లో మంత్రిని ప్రశ్నించారు. దీనిపై రైల్వే మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం రైలు టిక్కెట్లపై రాయితీని పునరుద్ధరించడం సాధ్యం కాదని స్పష్టం చేసారు. కోవిడ్ కాలం ప్రారంభమైనప్పటి నుంచి రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై ఇచ్చే రాయితీని నిలిపివేసారు. ప్రయాణీకుల రాయితీల కోసం గత ఏడాది రూ 59 వేల కోట్ల రాయితీలు ఇచ్చినట్లు మంత్రి వివరించారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా మంత్రి పేర్కొన్నారు.
రైల్వేలో ఫించన్ల కోసం 60 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా.. వేతనాల కోసం రూ 97 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంధనం కోసం మరో 40 వేల కోట్లు వెచ్చిస్తున్నామని రైల్వే మంత్రి లెక్కలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. రైల్వే రాయితీ లేకపోవడంతో 63 లక్షల మంది సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణం మానేశారని, సీనియర్ సిటిజన్లకు మళ్లీ రైలు ఛార్జీలపై రాయితీ ఇవ్వాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసిందా అనే ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటామని మంత్రి చెప్పారు. రైల్వేల పరిస్థితిని అందరూ అర్దం చేసుకోవాలని మంత్రి కోరారు.