రైతు బంధు, భీమా, కరెంట్ ఇస్తున్నందుకు వ్యతిరేకులమా..? గోయల్పై నిరంజన్ కస్సు బుస్సు
కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య యాసంగి పంట కొనుగోళ్ల అంశం అగ్గిరాజేస్తోంది. రా రైస్ కొంటామని కేంద్రం అంటుంటే.. మొత్తం కొనుగోలు చేయాలని తెలంగాణ అంటోంది. దీనిపై డైలాగ్ వార్ పీక్కి చేరింది. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్ చేశారు. ఆ వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గోయల్పై కస్సు బుస్సుమని అన్నారు.
యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆ బృందానికి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు విన్న వెంటనే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారాత్మక ధోరణి మాత్రమేనని తప్పుపట్టారు. ఉద్యమిస్తున్న రైతులను చంపి క్షమాపణ చెప్పారని ఫైరయ్యారు. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా మాటలు చెబుతారా? చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోడీ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?" అని నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
పంజాబ్, హర్యానాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ ధాన్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న తీరుపై వారు కేంద్ర మంత్రులను నిలదీయాలి.. కానీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పైగా విమర్శలు చేశారు. ప్రతీగా నిరంజన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంలో నిరంజన్ రెడ్డితోపాటు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.