మణిపూర్ లో హింస: ముగ్గురి మృతి, నిప్పు
ఇంపాల్: మణిపూర్ లో భారీ హింస చెలరేగింది. సోమవారం రాత్రి వందలాధి మంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. మణిపూర్ దక్షిణ ప్రాంతంలో ఓ మంత్రితో పాటు ఐదుగురు శాసన సభ్యల ఇండ్లకు నిప్పంటించారు.
మణిపూర్ ఆరోగ్య శాఖ మంత్రి పుంగ్ జతాంగ్ ట్యాన్సింగ్ ఇంటితో పాటు శాసన సభ్యుల ఇండ్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఆందోళనకారులను అదుపు చెయ్యడానికి నానా ఇబ్బంది పడుతున్నారు. సాయుధ బలగాలను రంగంలోకి దింపారు.
మణిపూర్ హింసలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మణిపూర్ లో రాష్ట్రేతరులను నియంత్రించే ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్బీ) బిల్లును శాసన సభ అమోదించడాన్ని నిరసిస్తూ ఈ హింస కొనసాగింది. స్థానికులు, స్థానికేతరుల గుర్తింపునకు 1951ని ప్రతిపాదిత సంవత్సరంగా పరిగణించాలన్నది ఈ బిల్లు ప్రధానాంశం.
దీని ప్రకారం1951 ముందు నుంచి రాష్ట్రంలో నివసిస్తున్న వారికి మాత్రమే ఆస్తి హక్కు ఉంటుంది. 1951 తరువాత మణిపూర్ లో స్థిరపడిన వారి ఆస్తులు వదులుకుని ఆ రాష్ట్రం వదిలి వెళ్లాల్సిందిగా కోరే హక్కు ఆ ప్రభుత్వానికి ఉంటుంది.
ఆరోగ్య శాఖ మంత్రితో పాటు శాసన సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించలేదని ఆందోళనకు దిగారు. మణిపూర్ లోని అనేక ప్రాంతాలలో కర్ప్యూ విధించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 8 మందికి తీవ్రగాయాలైనాయి.