రమ్యను 8 గంటలు విచారించిన అధికారులు: రూ. కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే !
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ భార్య రమ్యను 8 గంటల పాటు విచారించిన ఆదాయపన్ను శాఖ అధికారులు మీ పేరు మీద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి ? అని ఆమె నుంచి వివరాలు సేకరించి ఇప్పుడు మళ్లీ
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పుణ్యమాని పీకల్లోతుల్లో కూరుకుపోయిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ తో పాటు మరి కొందరికి ఆదాయపన్ను శాఖ అధికారులు మళ్లీ సమన్లు పంపే సూచనలు కనపడుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మంత్రి విజయభాస్కర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో సహ నటుడు, సమత్తువ మక్కల్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు శరత్ కుమార్, ఆయన భార్య నటి రాధిక తదితరులను విచారించి వివరాలు సేకరించారు. ఇప్పుడు వీరికి మరో సారి సమన్లు జారీ చేసి విచారణ చెయ్యాలని అధికారులు నిర్ణయించారని సమాచారం.

32 చోట్ల ఐటీ అధికారుల దాడులు
గత నెల 7వ తేదీన చెన్నైలోని మంత్రి విజయభాస్కర్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలతో సహ 32 చోట్ల ఏక కాలంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

టీటీవీ దినకరన్ గుట్టురట్టు అయ్యింది
ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు మద్దతుగా ఓట్లు వెయ్యాలని రూ. 89 కోట్ల మేరకు నగదు ఖర్చు చేశారని విలువైన ఆధారాలు లభించాయి. ఎన్నికల కమిషన్ వెంటనే ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వేసింది.

మంత్రి పదవి పోయేది, కానీ ?
మంత్రి విజయభాస్కర్ కు సమన్లు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు అనేక సార్లు ఆయన్ను విచారించారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం ఎడప్పాడి పళనిసామి మీద పలువురు మంత్రులు ఒత్తిడి చేసినా ఆ సమయంలో టీటీవీ దినకరన్ అడ్డుపడి విజయభాస్కర్ కు మంత్రి పదవి పోకుండా కాపాడారు.

దినకరన్ తీహార్ జైల్లో ఉంటే ఎలా కాపాడుతాడు !
ప్రస్తుతం టీటీవీ దినకరన్ తీహార్ జైల్లో ఉండటంతో మంత్రి విజయభాస్కర్ కు ఆదరణ కరువై కష్టాల్లో పడిపోయారు. ఇదే సమయంలో గత రెండు వారాల నుంచి స్థబ్దత పాటించిన ఆదాయపన్ను శాఖ అధికారులు మళ్లీ ఒక్క సారిగా తెరమీదకు వచ్చి మంత్రి విజయభాస్కర్ కేసు మీద శ్రద్ధపెట్టారు.

రమ్యకు సమన్లు
ఈనెల 2వ తేదీన మంత్రి విజయభాస్కర్ భార్య రమ్యకు సమన్లు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణకు హాజరుకావాలని సూచించారు. విజయభాస్కర్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల విలువైప ఆస్తుల్లో ఎక్కువ రమ్య పేరుతో ఉన్నాయని అధికారులు గుర్తించారు.

రమ్యను 8 గంటలు విచారించి !
మంత్రి విజయభాస్కర్ భార్య రమ్యను చెన్నైలోని నుంగమ్ బాక్కంలోని కార్యాలయంలో 8 గంటల పాటు విచారించిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు వివరాలు సేకరించారని తెలిసింది. ఇదే సమయంలో తన పేరు మీద ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయి ? అనే విషయం రమ్య అధికారులకు చెప్పారని సమాచారం.

రమ్య ఏం చెప్పారు !
రమ్య ఇచ్చిన సమాచారం మేరకు ముందుకు వెళ్లాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ దెబ్బతో మంత్రి విజయభాస్కర్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు మళ్లీ విచారణ చేసే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇప్పుడు మంత్రి విజయభాస్కర్ తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications