అతనికి 16, ఆమెకు20: పెళ్లైన 15 రోజులకే అతనో పెద్ద షాక్ ఇచ్చాడు!
బెంగళూరు: ఫేస్బుక్ పరిచయం వారిద్దరిని దగ్గర చేసింది. అతని వయసు తక్కువైనా ఆమె పట్టించుకోలేదు. ఆమె దివ్యాంగురాలైనా అతనికి అదేమి అడ్డురాలేదు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లింది. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగింది?
అతను 16, ఆమె 20..:
కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంకు చెందిన ఓ యువతి(20) స్థానికంగా డిగ్రీ చదువుతోంది. ఆమె దివ్యాంగురాలు. 5నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా బేగూరుకు చెందిన ఓ అబ్బాయి(16)తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
పెళ్లి చేసుకోవాలని పారిపోయారు..:
పరిచయం కాస్త కొద్దిరోజులకు ప్రేమగా మారింది. మొదట్లో ఫోన్లకు పరిమితమైన ఇద్దరు ఆ తర్వాత అప్పుడప్పుడూ బయట కలుస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా నెల రోజుల క్రితం ఎక్కడికో వెళ్లిపోయారు.
పెళ్లి తర్వాత అక్కడే కాపురం..:
ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత వారి గురించి ఇరు కుటుంబాల వాళ్లు చాలా చోట్లా వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు. కొద్దిరోజుల క్రితమే వారిద్దరి ఆచూకీ దొరికింది. బాగేపల్లిలోని ఓ దేవాలయంలో వారిద్దరు వివాహం చేసుకున్నారని, అక్కడే ఓ స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
పెద్ద షాకే ఇచ్చాడు..:
యువతి ఆచూకీ తెలియడంతో.. బాగేపల్లికి వెళ్లి ఆ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చారు ఆమె కుటుంబ సభ్యులు. చట్టబద్దంగా ఇద్దరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నారు. దీంతో ఇందుకు అవసరమైన పత్రాలు తీసుకొస్తానని చెప్పి ఆ బాలుడు తమ ఇంటికి వెళ్లాడు. ఆపై అతను మళ్లీ తిరిగిరాకపోవడంతో యువతి తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ బాలున్ని పట్టుకుని రాగా.. ఆ యువతి ఎవరో తనకు తెలియదంటూ పెద్ద షాక్ ఇచ్చాడు.
తలపట్టుకున్న పోలీసులు:
పెళ్లి చేసుకుని 15రోజులు కాపురం కూడా చేసినవాడు.. తీరా ప్లేటు ఫిరాయించేసరికి యువతి తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. బాలుడు మైనర్ కావడంతో పోలీసులు సైతం ఈ కేసును ఎలా డీల్ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆ యువతి మాత్రం తన భర్త తనకు కావాలని పట్టుబడుతోంది. కేసును పరిష్కరించేందుకు న్యాయ నిపుణుల సలహా కోసం సంప్రదిస్తామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.