ప్రేమించలేదని యువతిపై కారం చల్లి, పాశవిక దాడి
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై కొందరు యువకులు పాశవికంగా దాడి చేసి తీవ్ర గాయాలకు గురిచేశారు. ప్రేమించాలని వెంటపడుతున్న ఓ ఆకతాయిని ఆ బాలిక తిరస్కరించింది.
దీంతో ఆమెపై కోపం పెంచుకున్న సదరు యువకుడు, మరికొందరు తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు. దారిలో ఆమెను అడ్డగించి దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ముందు బాలిక కళ్లల్లో కారం కొట్టిన యువకులు అనంతరం ఆమెను విపరీతంగా గాయపరిచారు.
ఈ ఘటనలో బాలిక రెండు చేతులు, వేళ్లు చితికిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కళ్లల్లో కారంకొట్టడంతోపాటు గాయాలయిన కారణంగా ఆ బాలిక తీవ్రంగా రోదిస్తోంది. తమ కూతురుకు జరిగిన ఈ సంఘటనను చూసి తీవ్రంగా భయపడ్డామని, తాము చాలా పేద వాళ్లమని బాధితురాలి తల్లి వాపోయింది.
ప్రస్తుతం గాయపడిన బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.