ఫీజు కట్టలేదని విద్యార్థిని కొట్టి చంపేశారు
ఇంపాల్: సకాలంలో స్కూల్ ఫీజు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని అతిదారుణంగా కొట్టి చంపేసిన ఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న సురేష్ తొంగ్ బ్రమ్ (12) అనే బాలుడు హత్యకు గురైనాడు.
బాలుడి తండ్రి బీరా తొంగ్ బ్రమ్ కథనం మేరకు ఇంపాల్ సమీపంలోని లాంగోల్ లో ఉన్న ప్రయివేట్ రెసిడెన్సియల్ కిడ్స్ కేర్ స్కూల్ లో రెండు సంవత్సరాల క్రితం సురేష్ చేరాడు. బీరా తొంగ్ బ్రమ్ పేద రైతు.
మొదట సురేష్ కు సకాలంలోనే ఫీజు చెల్లించారు. ఇటీవల పంటలో నష్టం రావడంతో సరైన సమయంలో ఫీజు చెల్లించలేకపోయారు. స్కూల్ ఫీజు చెల్లించాలని, లేదంటే నీ కుమారుడిని పిలుచుకుని వెళ్లాలని బీరాకు స్కూల్ అధికారులు సమాచారం ఇచ్చారు.
కుమారుడిని ఇంటికి తీసుకెళ్లిపోదామని ఆయన స్కూల్ దగ్గరకు వెళ్లారు. ఈ నెల 31 తేది లోగా స్కూల్ ఫీజు చెల్లించి పిల్లాడిని తీసుకు వెళ్లాలని స్కూల్ యాజమాన్యం సూచించింది. డబ్బులు లేక బీరా తిరిగి ఇంటికి వెళ్లాడు.
రెండు రోజుల తరువాత స్కూల్ యాజమాన్యం సురేష్ ను అతని ఇంటి దగ్గరకు తీసుకు వచ్చారు. ఇంటికి వచ్చిన సురేష్ కుప్పకూలిపోయాడు. శరీరం మీద వాతలు ఉండటంతో సురేష్ తండ్రి బీరా స్కూల్ అధికారులను ప్రశ్నించారు.
క్రమశిక్షణ తప్పడం వలనే తాము నాలుగు దెబ్బలు తగిలించామని చెప్పిన స్కూల్ అధికారులు అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. కుప్పకూలిన కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స విఫలమై ఆదివారం సురేష్ మరణించాడు.
సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన బిడ్డను కొట్టి చంపిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంత వరకు తాను సురేష్ మృతదేహాన్ని తీసుకుపోనని బీరా తేల్చి చెప్పాడు. స్కూల్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.