కేజ్రీవాల్ పార్టీకి గ్లామర్ డోస్: ఆమ్ ఆద్మీలో చేరిన మిస్ ఇండియా
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గ్లామర్ డోస్ పెరిగింది. మిస్ ఇండియా ఢిల్లీ మాన్సీ సెహెగల్ కొద్దిసేపటి కిందటే ఆ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ సీనియర్ నేత, రాజీందర్ నగర్ శాసన సభ్యుడ, ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్ రాఘవ్ ఛడ్డా సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాఘవ్ ఛడ్డా.. ఆమ్ ఆద్మీ పార్టీ అనే అక్షరాలను ముద్రించి ఉన్న టోపీని ఆమెకు అందజేశారు. రాజకీయాల్లో అడుగు పెట్టదలిచిన కొత్త తరానికి తమ పార్టీ కేరాఫ్గా నిలిచిందని రాఘవ్ ఛడ్డా వ్యాఖ్యానించారు. అవినీతి రహిత రాజకీయాలకు పార్టీ కేంద్రబిందువైందని అన్నారు.
మాన్సీ సెహెగల్..2019లో మిస్ ఇండియా ఢిల్లీ టైటిల్ విన్నర్గా నిలిచారు. రాజకీయాల్లోకి రావాలని తాను ఏ మాత్రం అనుకోలేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన తీరు, ఆయన రాజకీయ వ్యవహార శైలిని చూసి ఆకర్షితురాలినయ్యానని అన్నారు. రాజకీయాలంటే అసహ్యం వేసే స్థాయి నుంచి దాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి కే్జ్రీవాల్ కృషి చేస్తోన్నారని చెప్పారు. అలాంటి నాయకుడికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ వంటి అవినీతి రహిత పార్టీల్లో చేరడం వల్ల తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకున్నట్టవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
మిస్ ఇండియా ఢిల్లీ టైటిల్ గెలుచుకున్న తరువాత.. ఆమె పారిశ్రామికరంగం వైపు అడుగులు వేశారు. ఓ స్టార్టప్ను నెలకొల్పారు. దాన్ని విజయవంతంగా నడిపిస్తోన్నారు. ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యుర్గా గుర్తింపు పొందారు. తాజాగా- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉందనే కారణంతోనే తాను ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నానని మాన్సీ సెహెగల్ తెలిపారు. నిస్వార్థంగా ప్రజలకు నిజమైన సేవను చేయడానికి ఈ పార్టీలోనే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు.