మిజోరంలో చరిత్ర సృష్టించిన బీజేపీ: గుడ్డి కన్నా మెల్ల మేలు అనే సామెత, ఒకే ఒక్కడు!
మిజోరం: కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం ప్రతిపక్షాలకు అప్పగించిన బీజేపీకి ఓ చిన్న ఫలితం ఊరట కలిగించింది. మిజోరంలో బీజేపీ అభ్యర్థి మొదటి సారి విజయం సాధించి ఆ రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. మిజోరంలో బీజేపీకి గుడ్డి కన్నా మెల్ల మేలు అనే సామెత సరిగ్గా సరిపోయింది.
మిజోరంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీకి 1 స్థానంలో విజయం సాధించింది. 2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా మిజోరంలో బీజేపీ 39 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపింది.
మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాథూరామ్ లాల్ థన్వావాల్ ఊహించని రీతిలో పరాజయం పొందారు. సాథూరామ్ లాల్ థన్వావాల్ మంత్రి వర్గంలో చేపల పెంపకం, పట్టుపరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన డాక్టర్ బుధ్ద ధన్ భక్మా కొన్ని నెలల క్రితం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భక్మా తరువాత బీజేపీలో చేరారు. 39 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయితే మిజోరం చరిత్రలో మొదటి సారి బీజేపీ ఒంటరిగా తన ఖాతా తెరిచింది. మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన డాక్టర్ బుద్ద ధన్ భక్మా తుయిచాంగ్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.
అరుణాచల్ ప్రదేశ్ ల్ లో బౌధ్దుల మీద జరిగిన దాడులు, మిజోరంలో నీట్ పరిక్షల్లో విద్యార్థులకు జరిగిన అన్యాయాలపై డాక్టర్ బుద్ద ధన్ భక్మా పోరాటం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం మీద మిజోరంలో బీజేపీ ఒక్క నియోజక వర్గంలో విజయం సాధించి ఆ రాష్ట్ర చరిత్రలోనే చరిత్ర సృష్టించింది.