మిజోరాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల... హామీలు చూస్తే వావ్ అనాల్సిందే..!
మిజోరాం: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రచారాలు ,బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. జాతీయ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలున్న రాష్ట్రాల్లో సభలు నిర్వహించి ప్రసంగిస్తున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది రెండు ప్రభుత్వాలే కావడం విశేషం. ఒకటి కాంగ్రెస్ మరొకటి మిజోరాం నేషనల్ ఫ్రంట్ పార్టీలు. ఇదిలా ఉంటే మిజోరాంలో కూడా పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మిజోరాం ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ తమ మేనిఫెస్టోను రూపొందించింది.
మిజోరాం రాష్ట్రాన్ని డిసైడ్ చేయనున్న మద్యపాన నిషేధం అంశం
రూపాయికే కిలో బియ్యం...జిల్లా హెడ్క్వార్టర్లలో ఫుట్బాల్ గ్రౌండ్స్
క్రైస్తవులు అత్యధికంగా ఉండే మిజోరాం రాష్ట్రంలో బీజేపీ తన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రూపాయికే కిలో బియ్యంతో పాటు అన్ని 8 జిల్లా హెడ్క్వార్టర్లలో ఫుట్బాల్ గ్రౌండ్స్ నిర్మిస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు చేరేలా బీజేపీ చూస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్ తెలిపారు. ప్రతి రంగంలో అభివృద్ధి చేసి చూపుతామని తమ మేనిఫెస్టో కూడా ఇదే చెబుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడు ఇంజనీరింగ్ కళాశాలలు, మూడు మెడికల్ కళాశాలలు నిర్మిస్తామని రాంమాధవ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
మిజో భాషను రాజ్యంగంలోని 8వ షెడ్యూల్లో చేరుస్తాం
ఇదిలా ఉంటే మిజో భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. మరోవైపే కాంగ్రెస్ తీసుకువచ్చిన భూవినియోగం విధానం చట్టాన్ని సవరిస్తామని పేర్కొంది. అంతేకాదు మిజో నేషనల్ ఫ్రంట్ రెబెల్స్ ఎవరైతే ఆయుధాలను వీడారు అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. ఇప్పటికే ఐదు సార్లు ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ మిజోరాంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. మిజోరాంలో 87శాతం క్రైస్తవ జనాభా ఉంది. భారత్లో ఏడు ఈశాన్య రాష్ట్రాలుండగా ఒక్క మిజోరాంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షం అధికారంలో ఉన్నాయి. ఈ సారి మిజోరాంలో 39 సీట్లలో బీజేపీ పోటీలో నిలుస్తోంది .
అయిజ్వాల్ మీదుగా మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు జాతీయ రహదారి
మిజోరాంలో బీజేపీ అధికారంలోకి వస్తే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేకాదు ఆరు నెలల సమయంలో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మించడంతో పాటు మిజోరాంకు సరిహద్దు దేశాలైన మయన్మార్ బంగ్లాదేశ్ దేశాలను అనుసంధానం చేస్తూ అయిజ్వాల్ మీదుగా రహదారి వెళుతుందని మేనిఫెస్టోలో పొందుపర్చింది బీజేపీ. నవంబర్ 28న మిజోరాంలోని 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.