జాతీయ స్దాయిలో నీట్ రద్దు! ప్రధాని మోడీ, 8 సీఎంలకు స్టాలిన్ లెటర్స్... !
వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు. నీట్ ను జాతీయ స్ధాయిలో రద్దు చేయాలని, ఆసక్తి ఉన్న రాష్ట్రాలు మాత్రమే నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. దీని ప్రకారం తమిళనాడును నీట్ నుంచి మినహాయించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.
12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు ఉండాలని, అప్పుడే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ ద్వారా కాకుండా మెడికల్ అడ్మిషన్లను 12వ తరగతి మార్కుల ఆధారంగానే ఇవ్వాలని కోరారు.

అలాగే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, బెంగాల్ వంటి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం స్టాలిన్ వేర్వేరు లేఖలు రాశారు. ఆయా రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లోనూ నీట్ రద్దుకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని కోరారు. తమ రాష్ట్రాల్లో విద్యార్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీట్ ను జాతీయ స్ధాయిలో రద్దు చేయాలని కూడా సూచించారు. అలాగే లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా తమిళనాడును నీట్ నుంచి మినహాయించాలన్న డిమాండ్ కు మద్దతివ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications