జయలలిత ఆరోగ్యంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రాజకీయం చేసే ఉద్దేశ్యం తమకు లేదని ప్రతిపక్షనేత, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కావేరి వంటి జఠిలమైన సమస్యలను పరిష్కరించేందుకు గాను తాత్కాలిక సీఎంను నియమించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టాలిన్ నేతృత్వంలో డీఎండీకే శ్రేణులు శుక్రవారం తంజావూరులో నిరాహార దీక్ష చేపట్టాయి. దీక్ష అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అనారోగ్యం కారణంగా జయలలిత మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యలు స్పష్టం చేశారని అన్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కావేరి జలాల వివాదం పరిష్కారానికి, పాలన సక్రమంగా జరగడానికి గాను అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతను డిప్యూటీ సీఎంగా లేదా తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత వీలైనంత త్వరగా కోలుకోవాలని పార్టీతో పాటు తమ అధ్యక్షుడు కరుణానిధి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జయలలిత మరిన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో పాలనపై మంత్రి వర్గం దృష్టిసారించింది.
ఇందులో భాగంగా ఈ మేరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలోనే శుక్రవారం సాయంత్రం మంత్రివరంగా అత్యవసరంగా భేటీ అయింది. ఇప్పటివరకు తమిళనాడుకు డిప్యూటీ సీఎం లేనందున కొత్తగా పదవి ఏర్పాటుచేసేలా మంత్రులు, గవర్నర్తో చర్చలు జరుపుతున్నారు.
అనంతరం ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం నేరుగా రాజ్ భవన్కు వెళ్లి ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరించడంతోపాటు డిప్యూటీ సీఎం నియామకంపైనా గవర్నర్తో చర్చించారు. డిప్యూటీ సీఎం రేసులో తమిళనాడు సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఉన్నారు.
గవర్నర్తో సాధారణ సమావేశమే: రాజ్ భవన్
తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుతో ఆ రాష్ట్ర సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామిల సమావేశం వివరాలను రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. మంత్రులతో ఇన్ ఛార్జ్ గవర్నర్ సమావేశంలో ఎలాంటి ప్రత్యేకతా లేదని, సాధారణ సమావేశమని రాజ్ భవన్ తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితితో పాటు సాధారణ పరిపాలన, కావేరీ నదీజలాల అంశాలపైన చర్చ జరిగినట్టు రాజ్ భవన్ ప్రకటన జారీ చేసింది.