సైనికుల భార్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ ఏడాదిన్నర పాటు సస్పెన్షన్
ఆర్మీ సైనికుల భార్యలపై అసభ్యంగా మాట్లాడిన మహరాష్ట్ర స్వతంత్ర ఎమ్మేల్సీ ప్రశాంత్ పరిచారక్ పై వేటు పడింది. విపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోయడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
ముంబై:ఆర్మీ సైనికుల భార్యలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహరాష్ట్ర స్వతంత్ర ఎమ్మేల్సీ ప్రశాంత్ పరిచారక్ పై వేటు పడింది. బిజెపి మద్దతుతో ఎమ్మేల్సీగా గెలుపొందిన ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
బీజేపి మిత్రపక్షం శివసేన సహ ప్రతిపక్షాలన్నీ ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను మహరాష్ట్రలోని బీజెపి ప్రభుత్వం ఏడాదిన్నరపాటు శాసనమండలి నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొంది.
అంతేకాదు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.మండలి చైర్మెన్ రాంరాజే నింబల్కర్ నేతృత్వంలోని ఈ కమిటీలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీఎమ్మేల్సీ పరిచారక్ వాదనను విన్న అనంతరం తుది చర్యలకు సిఫారసు చేయనుంది.
స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత నెల పరిచారక్ ప్రసంగిస్తూ సైనికుల భార్యలపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడవునా ఇంటికి రాకపోయినా తమ భార్యలకు పిల్లలు పుట్టగానే సైనికులు సరిహద్దుల్లో స్వీట్లు పంచుతారని ఆయన వ్యాఖ్యానించారు.
సైనికుల భార్యలు విశ్వాసపాత్రంగా ఉండరంటూ పరోక్షంగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు పలువురు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పరిచారక్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.